గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జలధార – జల హారతి కార్యక్రమంతో జిల్లాలో భూగర్భ జలాలు పెరగాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ అన్నారు. జలధార – జల హారతి కార్యక్రమంపై మంగళవారం సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. వంద రోజుల కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన పనులు నీటి వనరుల నిల్వలు పెంచడానికి, నీటిని సంరక్షించడానికి, సాగు నీటి వ్యవస్థ బలోపేతం కావడానికి తోడ్పడాలన్నారు.
ప్రతి మండలంలో చిన్న నీటి తరహా చెరువులు, వాటికి సంబంధించిన ఫీడర్ కాలువలను పూర్తిగా పునరుద్ధరించుటకు ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. గత ఆరు నెలల్లో భూగర్భ జలాలు, ప్రస్తుత భూగర్భ జలాలు విశ్లేషించి వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్న మండలాల్లో భూగర్భ జలాల స్థాయిని పెంచేందుకు జలధార జలహారతి కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు.
ఫీడర్ కాలువల పునరుద్ధరణ పనులను ఉపాధి హామీ పథకం కింద వేతనదారుల ద్వారా చేపట్టాలని అన్నారు. కాలువలపై ఆక్రమణలు, కాలువలు మూసుకుపోవడం, లేదా పంటలు వేసి వాటిని వినియోగించడం వంటి అంశాలు ఉంటే వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలని, ఫీడర్ కాలువలను పూర్తిగా పునరుద్ధరించి భూగర్భ జలాలు పెంచాలని అన్నారు. గొలుసుకట్టు చెరువులపైనా శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు. ఇప్పటికే మంజూరు చేసిన పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని తద్వారా వర్షాలు కురిసే సమయంలో మంచి ఫలితాలు సాధించగలమని, అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయని చెప్పారు.
Prajavartha Online Telugu News