అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారాజధాని అమరావతి నగర నిర్మాణం నిమిత్తం భూసేకరణ కార్యకలాపాలకై అనంతవరంలో APCRDA ఆధ్వర్యంలో శనివారం గ్రామసభ జరిగింది. నేడు జరిగిన గ్రామసభలో కమిషనర్ వి.విజయరామరాజు ఐఏఎస్, అడిషనల్ కమిషనర్లు ఏ.భార్గవతేజ ఐఏఎస్, కె.కార్తీక్ ఐఏఎస్ హాజరయ్యారు.
రాజధాని నగరంలో నిర్మిస్తున్న రహదారులు, LPS జోన్లు, తదితర అభివృద్ధి ప్రాజెక్టుల నిమిత్తం భూసమీకరణ(ల్యాండ్ పూలింగ్- LPS) చేపట్టామని.. సమీకరణకు కొందరు రైతులు, భూయజమానులు ముందుకు రానందున..రైతులతో పలుమార్లు చర్చించిన అనంతరం నిర్ణీత విధానంలో మాత్రమే ఇటీవల భూసేకరణ ప్రక్రియకై నోటిఫికేషన్ విడుదల చేశామని కమిషనర్ గ్రామస్తులకు వివరించారు. భూసమీకరణలో పాల్గొనేందుకు రైతులకు ఇప్పటికీ అవకాశం ఉందని, భూసేకరణ ప్రకటనలో పేర్లు ఉన్నప్పటికీ సంబంధిత రైతులు నిర్ణీత గడువులోపు భూసమీకరణలో పాల్గొనేందుకు అవకాశముందని కమిషనర్ గారు గ్రామసభలో స్పష్టం చేశారు. గ్రామస్తులు స్థానికంగా నెలకొన్న పలు సమస్యలను, టిడ్కో గృహాల వద్ద మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని కమిషనర్ దృష్టికి తీసుకురాగా..సంబంధిత అధికారులకు ఆయా సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే రాజధాని గ్రామాలలో మౌలిక వసతుల అభివృద్ధికి సైతం ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నామని కమిషనర్ పేర్కొన్నారు.
రాజధాని అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నందున, రాజధాని గ్రామాల రైతులు APCRDA అధికారులకు సహకరించాలన్నారు. అలాగే రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులు స్థానికంగా అందుబాటులో ఉండే కాంపిటెంట్ అథారిటీ కార్యాలయాలలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలన్నారు. గ్రామసభలో APCRDA ప్లానింగ్ విభాగ డైరెక్టర్ బి. సురేష్ కుమార్(FAC), స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు పి.మధుసూధనరావు, పి.పద్మావతి, తహసీల్దార్ పి. సతీష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News