– బీఎల్వోల ఇంటింటి సందర్శనకు మరింత సమయం
– కార్యక్రమంలో మరింత పారదర్శకత, కచ్చితత్వానికి వీలు
– జిల్లాలో 99.46 శాతం మేర డిజిటైజేషన్ ప్రక్రియ
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో కీలకమైన బీఎల్వోల ఇంటింటి సందర్శనకు ఈసీఐ ఈ నెల 24వ తేదీ వరకు గడువు పొడిగించడం జరిగిందని.. కార్యక్రమంలో మరింత పారదర్శకత, కచ్చితత్వానికి ఇది దోహదం చేస్తుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. బీఎల్వోలు, బీఎల్ఏలు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలు సవరించిన షెడ్యూల్ ప్రకారం కార్యకలాపాలను నిబద్ధతతో పూర్తిచేయాలని ఆదేశించారు. ఓటర్లు, రాజకీయ పక్షాలు, బీఎల్ఏలు కూడా ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
సవరించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 31వ తేదీన ముసాయిదా జాబితా ప్రచురణ ఉంటుందని.. అప్పటి నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు క్లెయిమ్లు, అభ్యంతరాల దాఖలకు వీలుంటుందన్నారు. ఈ నెల 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు నోటీసు దశ, క్లెయిములు, అభ్యంతరాల పరిష్కారం ఉంటుందని వివరించారు. చివరిగా అక్టోబర్ 3వ తేదీన తుది జాబితాను ప్రచురించనున్నట్లు తెలిపారు. ఓటర్ల జాబితా విశిష్టత స్ఫూర్తితో ప్రతిఒక్కరూ సమన్వయంతో పూర్తిచేసి ప్రక్రియను సజావుగా ముందుకు తీసుకెళ్లడంలో భాగస్వాములు అయ్యారని.. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన అదనపు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దోషరహిత ఓటర్ల జాబితా రూపకల్పనలో మరింత కీలకంగా వ్యవహరించాలన్నారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని స్పష్టం చేశారు. డేటాను నిశితంగా పరిశీలించాలని ఆదేశించారు.
జిల్లాలో మొత్తం 17,13,445 మంది ఓటర్లకుగాను 17,04,186 మంది (99.46 శాతం) ఓటర్లకు సంబంధించిన సమాచారం డిజిటైజేషన్ పూర్తయిందని వివరించారు. తిరువూరులో 2,07,673 (99.50 శాతం), విజయవాడ పశ్చిమలో 2,56,849 (99.95 శాతం), విజయవాడ మధ్యలో 2,77,099 (99.74 శాతం), విజయవాడ తూర్పులో 2,68,844 (99.67 శాతం), మైలవరంలో 2,84,317 (99.70 శాతం), నందిగామలో 2,03,243 (97.96 శాతం), జగ్గయ్యపేటలో 2,06,161 (99.33 శాతం) డిజిటైజేషన్ పూర్తయినట్లు కలెక్టర్ లక్ష్మీశ వివరించారు.
Prajavartha Online Telugu News