నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజంలోని పేద వర్గాలకు సామాజిక న్యాయం అందించేందుకు కృషిచేసి భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డా. బి.ఆర్.అంబేద్కర్ జీవితం నేటి యువతకు ఆదర్శనీయమని రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి అన్నారు. భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతిని సోమవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డా.బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ డా. బి.ఆర్. అంబేద్కర్ ఆలోచనలు, సిద్ధాంతాలు నేటి తరాలకు అనుసరణీయమన్నారు. డా. అంబేద్కర్ ఆనాడు రాజ్యంగంలో పౌరులకు కల్పించిన హక్కులు, ఆదేశిక సూత్రాలు నేటికీ ప్రజలకు రక్షణగా నిలుస్తున్నాయన్నారు. ప్రపంచ ప్రజలందరూ కొనియాడిన మహా మేధావి డా. అంబేద్కర్ అని, వారు అందించిన ఆశయాల స్పూర్తితో వాటికి అనుగుణంగా నేటి యువత నడిచినప్పుడే డా. అంబేద్కర్ కి మనమిచ్చే నిజమైన నివాళి అని రాజ్యలక్ష్మి చెప్పారు. డా. అంబేద్కర్ రచించిన భారతదేశ రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యుత్తమైనదని ప్రపంచ మేధావులచే కీర్తించబడినదన్నారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి బి. ఆర్. అంబేద్కర్ అని రాజ్యలక్ష్మి చెప్పారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఆ.ఈ.ఈ. కె.ఎల్.ఎన్ . ప్రశాంతి, పంచాయతీరాజ్ అధికారి ఎం. బసవయ్య, అసిస్టెంట్ బి.సి. వెల్ఫేర్ అధికారి ఏ .దివ్య, హార్టికల్చర్ ఆఫీసర్ ఎం. రత్నమాల, సబ్ కలెక్టర్ కార్యాలయం పరిపాలనాధికారి ఎం. హరనాథ్, కార్యాలయ సిబ్బంది, ప్రభృతులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News