-శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు తో కలిసి నిర్మాణ ప్రదేశం, తాత్కాలిక భవనాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
నూజివీడులో త్వరలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ చెప్పారు. నూజివీడులో గురువారం కేంద్రీయ విద్యాలయం నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని, తాత్కాలిక భవనాలను స్థానిక శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావుతో కలిసి జిల్లా కలెక్టర్ జె. నివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ నూజివీడులో త్వరలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముందుగా తాత్కాలిక భవనంలో తరగతులు నిర్వహించడం జరుగుతుందని, అనంతరం నూతనంగా నిర్మించబోయే భవనంలోకి మార్పు చేయడం జరుగుతుందన్నారు.
శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ నూజివీడు ప్రాంతం విద్యాభివృద్ధికి పేరుగాంచిందన్నారు. నూజివీడు లో త్రిబుల్ ఐటీ, ఇంజనీరింగ్ కళాశాలలు, 6 డిగ్రీ కళాశాలలు, పి జి సెంటర్, 10 జూనియర్ కళాశాలలున్నాయన్నారు. కేంద్రీయ విద్యాలయం రాకతో మరింత నాణ్యమైన విద్యను నూజివీడు ప్రాంత ప్రజలకు అందించేందుకు వీలవుతుందన్నారు. నూజివీడులో కేంద్రీయ విద్యాలయం నిర్మాణానికి 7 ఎకరాల స్థలం కేటాయించడం జరిగిందన్నారు. కేంద్రీయ విద్యాలయం ముందుగా ఓల్డ్ ఎంప్లాయిస్ కాలనీలోని నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలిక భవనంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. తరగతుల నిర్వహణకు గాను 80 లక్షల రూపాయలతో అదనపు తరగతి గదులు, మరమ్మత్తులు నిర్వహించడం జరుగుతుందన్నారు. పనులను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను శాసనసభ్యులు ఆదేశించారు.
కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ సయ్యద్ అబ్దుల్ రషీద్ , వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ, కౌన్సిలర్ శీలం రాము, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు, ప్రభృతులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News