-సచివాలయాల సిబ్బంది నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటించాలి
-సంక్షేమ పథకాల అమలు శాచ్యురేషన్ పద్ధతిలో జరగాలి
-వార్డు సచివాలయ సిబ్బందికి ఎమ్మెల్యే దిశానిర్దేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల అమలు శాచ్యురేషన్ పద్ధతిలో జరగాలని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. 61వ డివిజన్ శాంతినగర్ లోని 257 వ వార్డు సచివాలయాన్ని నవరత్నాల కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ నారాయణ మూర్తి, జాయింట్ కలెక్టర్(ఆసరా) మోహన్ కుమార్ తో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయాలలోని రికార్డులను పరిశీలించారు. సంక్షేమ పథకాల అమలు తీరుపై ఆరా తీశారు. ప్రభుత్వం నిర్దేశించిన సేవలను నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని సిబ్బందికి ఆదేశించారు. గడపగడపకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించే ఉద్దేశంతో ఏర్పాటైన వార్డు సచివాలయ వ్యవస్థ లక్ష్య సాధన కోసం ప్రతి ఒక్క ఉద్యోగి కృషి చేయాలని పిలుపునిచ్చారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ.. సంక్షేమ క్యాలెండర్ పై ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ వారిని చైతన్యపరచాలన్నారు. ఏదైనా సమస్యతో సచివాలయానికి వచ్చేవారు ఎవరూ కూడా నిరుత్సాహంతో వెనుదిరిగే పరిస్థితి ఉండకూడదన్నారు. పారిశుద్ధ్యం నిర్వహణ మరియు శానిటేషన్ సిబ్బంది పనితీరుపై ఎప్పటిప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయాలను సేకరించాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. మరోవైపు వార్డు సచివాలయం పరిధిలో 2,200 మందికి గాను 2,100 మందికి రెండో డోస్ వాక్సినేషన్ కూడా పూర్తి చేయటం అభినందనీయం అన్నారు. అన్ని సచివాలయాలలోను ఇదే తరహాలో వాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
ఈబీసీ నేస్తంపై మరింత విస్తృత అవగాహన కల్పించాలి
జనవరి 9(పాదయాత్ర ముగింపు రోజు)వ తేదీన ఈబీసీ నేస్తం పేరుతో అగ్రవర్ణ పేద మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనందించనున్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. ఈ పథకం ద్వారా.. 45 – 60 ఏళ్లలోపు వయసున్న వారికి ఏడాదికి రూ.15 వేల చొప్పున మూడేళ్ల పాటు రూ.45 వేలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఈ పథకంపై ఇప్పటినుంచే సచివాలయ సిబ్బంది సన్నద్ధంగా ఉండాలన్నారు. డివిజన్ లోని అగ్రవర్ణ పేదలకు ఈ పథకంపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. లబ్ధిదారులు అందజేయవలసిన ఈబీసీ సర్టిఫికెట్, ఇన్ కం తదితర సర్టిఫికెట్ల వివరాలను నోటీస్ బోర్డులో అంటించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవి, నాయకులు అవుతు శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి వెంకట్రావు, అలంపూర్ విజయ్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News