గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర పాలక సంస్ధ పరిధిలో జూలై 1 నుండి ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ లు మరియు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధము పటిష్టంగా అమలు చేస్తామని, ప్రజా ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు నగరపాలక సంస్థకు ప్రజలు, వ్యాపారులు సహకరించాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏఎస్ గారు కోరారు. బుధవారం కమిషనర్ ఆదేశాల మేరకు పట్నం బజార్, చేపల మార్కెట్, లాలాపేట పూలు మరియు పండ్ల మార్కెట్ ప్రాంతాల్లో ప్రజారోగ్య అధికారులు, సచివాలయ కార్యదర్శులు అవగాహన ర్యాలీలు చేశారు.
ఈ సందర్భంగా సిఎంఓహెచ్ డాక్టర్ విజయలక్ష్మీ మాట్లాడుతూ మేయర్ మరియు కమీషనరుల ఆదేశముల మేరకు గుంటూరు నగర పాలక సంస్ధ పరిధిలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ ల నిషేధము మరియు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధము జూలై 1 నుండి పక్కాగా అమలు చేస్తామన్నారు. నగర పరిధిలో 75 మైక్రాన్ల కంటె తక్కువ మందము గల ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ లు వాడుకమును మరియు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించటమైనది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనగా ప్లాస్టిక్ తో కూడిన ఇయర్ బడ్స్, ప్లాస్టిక్ జెండాలు, మిఠాయి కర్రలు, బెలూన్ ల కోసం ప్లాస్టిక్ కర్రలు, ఐస్ క్రీం స్టిక్, ప్లేట్, కప్పులు, గ్లాసులు, స్పూన్లు, కత్తులు, ఫోర్క్, స్ట్రా లు, ట్రే లు, సిగరెట్ పాకెట్లు, ప్యాకింగ్ మెటీరియల్, స్వీట్ ప్యాకెట్స్, ఇన్విటేషన్ కార్డ్స్, ప్లాస్టిక్ స్టిక్కర్లు మొదలైన వాటి తయారీ, దిగుమతి, నిల్వ, పంపిణీ, విక్రయం మరియు వినియోగం నిషేధించటమైనదన్నారు. నిషేధిత ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ లు మరియు నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాటి తయారీ, దిగుమతి, నిల్వ, పంపిణీ, విక్రయం , వినియోగము చేసిన యెడల జరిమానా విధించబడం మరియు చట్టపరమైన చర్యలు తీసుకొనబడునని స్పష్టం చేశారు. ఇప్పటికే వ్యాపారులకు, హోల్ సేల్ డీలర్లకు అవగాహన కార్యక్రమం చేపట్టామని, నగరంలో సచివాలయాల పరిధిలో కూడా ప్రజలకు ప్లాస్టిక్ వినియోగం నిషేధం పై అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ లకు బదులు జూట్ బ్యాగ్ లు, పేపర్ బ్యాగ్ లు, క్లాత్ బ్యాగ్ లు వినియోగించాలని మరియు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఇస్తరాకులకు బదులుగా అరటి ఆకులు వినియోగించుట, ధర్మకోల్ కప్పులకు బదులుగా ఆకు కప్పులు, స్టీల్ కప్పులు అదేవిధంగా టి ప్లాస్టిక్ కప్పులకు బదులు గాజు గ్లాసులు, స్టీల్ గ్లాసులు ఉపయోగించి, ప్రజారోగ్యానికి, పర్యావరణ రక్షణలో భాగస్వాములు కావాలని కోరారు.
కార్యక్రమములో శానిటరీ సూపర్వైజరు రాంబాబు, శానిటరీ ఇన్స్పెక్టరు దేవరపల్లి ప్రసాదరావు, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ రవీంద్రనాయక్,సాలిడ్ వెస్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ అనిల్ కుమార్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News