గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరగాలని, అందుకు తగిన విధంగా సచివాలయం వారీగా యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకోవాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ ప్రజారోగ్య అధికారులకు, శానిటేషన్ కార్యదర్శులకు స్పష్టం చేశారు. సోమవారం కమిషనర్ బస్టాండ్, బాలాజీ నగర్, ఎల్.బి.నగర్, కాకాని రోడ్, ఆర్.టి.సి. కాలనీ తదితర ప్రాంతాల్లో పారిశుధ్య పనులను తనిఖీ చేసి, పారిశుధ్య కార్మికులు మరియు ప్రజారోగ్య అధికారులకు తగు ఆదేశాలు జారి చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో రోడ్ల మీద లేదా కాలవల్లో చెత్త, వ్యర్ధాలు కనిపించడానికి వీలు లేదని, ప్రజారోగ్య కార్మికులున్ ఇంటింటి నుండి ఉదయాన్నే ప్రతి రోజు నిర్దేశిత సమయంలో చెత్త సేకరణ చేయాలన్నారు. రోడ్ల మీద, కాల్వల్లో వ్యర్ధాలు వేసే వారిని గుర్తించి వారికి అపరాధ రుసుం విధించాలని, షాప్స్ వారు వేస్తె సీజ్ చేయాలని శానిటేషన్ కార్యదర్శులను ఆదేశించారు. మధ్యాహ్నం సమయంలో ప్రతి రోజు గ్యాంగ్ వర్క్ తో కాల్వల్లో సిల్ట్ తొలగింపు, సమస్యాత్మక ప్రాంతాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. డంపర్ బిన్లు ఏర్పాటు చేసిన ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలన్నారు. శానిటరీ ఇన్సెపెక్టర్లు తమ పరిధిలోని శానిటేషన్ కార్యదర్శులతో సమన్వయం చేసుకొని, సచివాలయం వారీగా ఇంటింటి చెత్త సేకరణ, ప్రధాన రహదార్ల శుభ్రం పై పిన్ పాయింట్ యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు. కాంపాక్టర్, డంపర్ బిన్లు, పుష్ కాట్ లకు అవసరమైన మరమత్తులను శానిటరీ ఇన్సెపెక్టరే చేయించేందుకు తగిన అనుమతులు ఇస్తామని, చెత్త తరలింపు వాహనాలు సకాలంలో అందుబాటులో ఉండేలా చూడాలని డి.ఈ.ఈ.ని ఆదేశించారు. నగర స్వచ్చత, ప్రజారోగ్య రక్షణ, పర్యావరణ పరిరక్షణకు ప్రజలు కూడా సహకరించి, తమ ఇళ్ళల్లో ఉత్పత్తి అయ్యే వ్యర్ధాలను ఇంటి వద్దకు వచ్చే ప్రజారోగ్య కార్మికులకే ఇవ్వాలని కోరారు. పర్యటనలో శానిటరీ ఇన్సెపెక్టర్లు దౌలా, శ్రీనివాసరావు, సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News