న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజా వార్త :
కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ భారతదేశపు మొట్టమొదటి లిథియం బ్యాటరీ తయారీ కేంద్రం ప్రీ-ప్రొడక్షన్ రన్ను ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో రేపు సందర్శించనున్నారు. ఈ అత్యాధునిక తయారీ కేంద్రాన్ని చెన్నైకి చెందిన మునోథ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ.165 కోట్లతో ఏర్పాటు చేసింది. 2015లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తిరుపతిలో ప్రారంభించిన రెండు ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లలో ఇది ఒకటి. ఈ తయారీ కేంద్రం 270 మెగావాట్ల లక్ష్యంతో ఏర్పాటైంది. ఇక్కడ రోజూ 10Ah సామర్థ్యం గల 20,000 బ్యాటరీలను ఉత్పత్తి చేయనున్నారు. భారతదేశం ప్రస్తుతం వినియోగిస్తున్న 60శాతం పవర్ బ్యాంకుల్లో ఈ బ్యాటరీలను వినియోగించనున్నారు.
మొబైల్ ఫోన్లు, వినేందుకు, ధరించేందుకు ఉపయోగించే ఎలక్ట్రానిక్ వినియోగ పరికరాల కోసం కూడా ఈ కేంద్రంలో బ్యాటరీలు ఉత్పత్తి చేయబడతాయి. భారతదేశం ప్రస్తుతం తన అవసరాల కోసం లిథియం-అయాన్ బ్యాటరీలను ప్రధానంగా చైనా, దక్షిణ కొరియా, వియత్నాం మరియు హాంకాంగ్ నుండి దిగుమతి చేసుకుంటోంది. ఎలక్ట్రానిక్ తయారీలో భారతదేశాన్ని గ్లోబల్ హబ్గా మార్చాలనే ప్రధాని మోదీ మేకిన్ ఇండియా లక్ష్యాన్నిసాకారం చేసుకునే దిశలో ఈ ప్లాంట్ ప్రారంభోత్సవం ఒక ముందడుగు అని శ్రీ చంద్రశేఖర్ తిరుపతికి బయలుదేరే ముందు తెలిపారు. చంద్రశేఖర్ రెండు ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లలో ఉన్న డిక్సన్ టెక్నాలజీస్ మరియు యునైటెడ్ టెలిలింక్స్ లను సందర్శించి అందులోని సదుపాయాలను కూడా పరిశీలిస్తారు. మునోథ్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసిన లిథియం బ్యాటరీ తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడతారు.
Prajavartha Online Telugu News