-రైల్వే లైన్ క్రాసింగ్, పైప్ లైన్ల ఏర్పాటుకు ప్రత్యేక కార్యాచరణ
-పనుల పురోగతి పై రోజువారీ సమీక్ష
-నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏఎస్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
విలీన గ్రామాలకు సంవృద్దిగా త్రాగునీరు అందించే గోరంట్ల కొండ మీద రిజర్వాయర్ పనులు వేగవంతం కావాలని, పనులు పురోగతి పై ప్రతి రోజు నివేదిక ఇవ్వాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ గోరంట్ల కొండ మీద నిర్మాణంలో ఉన్న రిజర్వాయర్ పైప్ లైన్ పనులను కాకాని రోడ్ రిలయన్స్ పెట్రోల్ బంక్, గడ్డిపాడు రైల్వే గేటు క్రాసింగ్, గోరంట్లలో ఇంజినీరింగ్ అధికారులు మరియు కాంట్రాక్టర్లతో కలిసి పరిశీలించి పనుల వేగవంతంపై తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గోరంట్ల కొండ మీద రిజర్వాయర్ విలీన గ్రామాలు, ఇన్నర్ రింగ్ రోడ్, టిడ్కో ఇళ్లకు త్రాగునీరు అందించే కీలకమైన ప్రాజెక్ట్ అని, పనుల నిర్వహణలో ఎటువంటి అలసత్వం చూపవద్దని ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. గడ్డిపాడు రైల్వే లైన్ క్రాసింగ్ కు రైల్వే శాఖ నుండి అనుమతులు వచ్చినందున పనులు వేగవంతంపై ద్రుష్టి సారించాలన్నారు. రైల్వే లైన్ క్రాసింగ్, రోడ్ క్రాసింగ్ ల వద్ద ఇంజినీరింగ్ అధికారులు దగ్గర ఉండి పనులు పర్యవేక్షణ చేయాలన్నారు. కాకాని రోడ్ రిలయన్స్ పెట్రోల్ బంక్ నుండి పైప్ లైన్ పనులు 2 రోజుల్లో రైల్వే లైన్ వరకు రావాలన్నారు. పైప్ లైన్ పనులకు సమాంతరంగా కొండ మీదకు పైప్ లైన్లు, కొండ మీద రిజర్వాయర్ సివిల్ పనులు, రిజర్వాయర్ నుండి సరఫరా లైన్లకు అనుసంధానం పనులు ప్రణాళికాబద్దంగా చేపట్టాలన్నారు. కాంట్రాక్టర్ పనులు జాప్యం చేయకుండా ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షణ చేయాలని, ఏ సమస్య ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. పర్యటనలో ఎస్.ఈ. భాస్కర్, ఈ.ఈ. శాంతిరాజు, డి.ఈ.ఈ. హనీఫ్, ఏ.ఈ. రాము, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News