మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో తరచూ అక్రమ గనులు, మట్టి తవ్వకాలపై వార్తా కథనాలు వస్తున్నాయని వాటిపై సంబంధిత తహసిల్దార్లు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, డి ఆర్ ఓ ఎం వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు క్షేత్రాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి అక్రమ గనులు మట్టి తవ్వకం, జగనన్న సురక్ష జగనన్నకు చెబుదాం విద్యా వ్యవస్థ బలోపేతం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అక్రమ గనులు, మట్టి తవ్వకాలపై ప్రత్యేక దృష్టి సారించి నియంత్రించాలని బాధ్యులైన వారిపైన తగిన చర్యలు తీసుకోవాలని ఇదివరకే స్పష్టం చేయడం జరిగిందన్నారు. అయినప్పటికీ తరచూ అక్రమ గనులు, మట్టి తవ్వకాలపైన వార్తా కథనాలు ప్రచురితమవుతున్నాయన్నారు. ఈ విషయం తీవ్రంగా పరిగణించాలన్నారు. ఇకపై సంబంధిత తహసీల్దారులు వార్తా కథనాలు రాగానే ఎప్పటికప్పుడు తక్షణమే స్పందించి ఆయా ప్రదేశాలను పరిశీలించి విచారణ చేపట్టి వాస్తవ విషయాలతో నివేదిక కలెక్టరేట్ కు సమర్పించాలన్నారు. వాస్తవం కానిపక్షంలో వార్తా కథనాలను ఖండిస్తూ వివరణలు సంబంధిత వార్తా పత్రికలకు పంపాల్సి ఉంటుందన్నారు. ఈ టెలికాన్ఫరెన్స్లో తహసిల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News