– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-64 వ డివిజన్ 282 వ సచివాలయ పరిధిలో ఐదో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని పేదలందరికీ ప్రభుత్వం సంక్షేమ ఫలాలను అందిస్తున్నట్లు ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 64 వ డివిజన్ 282 వ వార్డు సచివాలయ పరిధిలో బుధవారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ యరగొర్ల తిరుపతమ్మతో కలిసి ఆయన పాల్గొన్నారు. కండ్రిక NSC బోస్ నగర్లో విస్తృతంగా పర్యటించి.. 380 గడపలను సందర్శించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందించిన పథకాలను ప్రజలకు వివరించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా చూసి తెలుసుకుని, వారందరికీ మేలు చేయాలన్న ఉద్దేశంతో నవరత్న పథకాలను అమలు చేస్తున్నారని మల్లాది విష్ణు చెప్పారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు అందిస్తున్నారన్నారు. సచివాలయ పరిధిలో 4,393 మంది లబ్ధిదారులకు అక్షరాలా రూ. 10.71 కోట్ల సంక్షేమాన్ని నేరుగా అందించడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
చట్ట సభలంటే టీడీపీకి కనీసం గౌరవం లేదు
చట్ట సభలంటే తెలుగుదేశం పార్టీకి కనీసం గౌరవం లేదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అసెంబ్లీ సమావేశాలలో ప్రతిపక్షానికి అధిక సమయం కేటాయించాలని.. వారు ప్రస్తావించే ప్రతి అంశాన్ని తప్పనిసరిగా అటెండ్ కావాలని తొలి సమావేశాల సమయంలోనే అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలివ్వడం జరిగిందన్నారు. కానీ ఏరోజైతే సమావేశాలను తెలుగుదేశం బహిష్కరించిందో.. ఆరోజే ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల టీడీపీకి చిత్తశుద్ధి లేదన్న విషయం తేటతెల్లమైందన్నారు. మరలా ఇప్పుడు అవినీతి కేసులో ఇరుక్కున్న చంద్రబాబుకు సింపథీ కోసం టీడీపీ శాసనసభ్యులు సమావేశాలకు రావాలనుకోవడం ప్రజలను అవమానించడమే అవుతుందన్నారు. ఈ సమావేశాలకు ప్రతిపక్షం ఎందుకోసం వచ్చినా.. సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని తెలియజేశారు. మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ స్కాం, ఫైబర్ నెట్ స్కాం, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, సీఆర్డీఏ, రాజధాని నిర్మాణం, ఏపీ సచివాలయ భవన నిర్మాణాల్లో చోటుచేసుకున్న అక్రమాలు, అవినీతి గూర్చి తెలియక పలుచోట్ల కొందరు అయ్యో పాపం అంటున్నారని.. వాస్తవాలు తెలిస్తే టీడీపీని ఛీ కొట్టడం ఖాయమని మల్లాది విష్ణు అన్నారు. కార్యక్రమంలో ఈఈ(ఇంజనీరింగ్) శ్రీనివాస్, డీఈ(యూజీడీ & వాటర్ సప్లై) రామకృష్ణ, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, 30వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ జానారెడ్డి, నాయకులు యరగొర్ల శ్రీరాములు, ఎస్.కె.ఇస్మాయిల్, జిల్లెల్ల శివ, పందిరి వాసు, మాతా మహేష్, మేడా రమేష్, కొక్కిలిగడ్డ నాని, చెక్కా నరసింహరావు, తాండవ కోటి, వెంకటేశ్వరమ్మ, రావి విమల, తులసమ్మ, దేవిరెడ్డి సంజీవరెడ్డి, సాదం శ్రీను, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News