గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల నిబందనల మేరకు ఓటర్ ఆచూకీ లేకుంటే ఫార్మాట్-బి నోటీసును రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపుతున్నామని, 15 రోజుల్లో సరైన సమాధానం ఇవ్వని ఓట్ల తొలగింపుకు చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం కమిషనర్ చాంబర్ లో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఫార్మేట్-బి, నూతన దరఖాస్తులు, ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ఓటర్ కార్డ్ లోని చిరునామాలో ప్రస్తుతం నివాసం లేని ఓటర్లును గుర్తించి వారికి ఫార్మేట్-బి నోటీసుని రిజిస్టర్ పోస్ట్ చేశామని, 15 రోజుల్లో నిర్దేశిత ఓటర్ల నుండి తగిన వివరణ రాకుంటే ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా వారి ఓటు తొలగించడం జరుగుతుందని తెలిపారు. అలాగే అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగించబడదు అని, అలా ఎక్కడైనా జరిగితే పీపుల్స్ రిప్రజంటేటివ్ యాక్ట్ 1950 ప్రకారం జిల్లా ఎన్నికల అధికారికి అప్పీల్ చేయవచ్చని, లేదా నూతన ఓటు కోసం ఫారం 6 ని దరఖాస్తు చేయవచ్చని తెలిపారు. పిఎస్ఈ (ఫోటో సిమిలర్ ఎంట్రీలు)/డిఎస్ఈ (డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీలు) ఉన్న ఓటర్లకు ఫార్మేట్-ఏ ద్వారా రిజిస్టర్ పోస్ట్ చేశామని, ఓటర్లు తమ ఓటు ఎక్కడ ఉంచాలో/తొలగించాలో కన్ఫర్మేషన్ లెటర్ ద్వారా తెలియచేయాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు సదరు అంశాల పై ప్రజలకు అవగాహన కల్గించడంలో సహకరించాలని కోరారు. ఓటర్ కి సంబందించిన సమగ్ర సమాచారం బిఎల్ఓలు దగ్గర ఉండాలని, తప్పనిసరిగా బిఎల్ఓ రిజిస్టర్ మైంటైన్ చేయాలన్నారు. రాజకీయ పార్టీల నుండి, ప్రజల నుండి అందిన ఫారాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ ద్వారా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. సమావేశంలో పశ్చిమ ఈఆర్ఓ, అదనపు కమిషనర్ కె.లక్ష్మీ శివ జ్యోతి, ఏఈఆర్ఓలు, డిప్యూటీ కమిషనర్లు సిహెచ్.శ్రీనివాస్, బి.శ్రీనివాసరావు, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, డిప్యూటీ సిటి ప్లానర్ కోటయ్య, సూపరిండెంట్లు సాంబశివరావు, పద్మ, రాజకీయ పార్టీలైన టిడిపి నుండి ఓంకార్, బిఎస్పి నుండి సిహెచ్.వాసు, బిజెపి నుండి ఆర్.భాస్కర్రావు, అమ్ ఆద్మీ నుండి సేవకుమార్, సిపిఎం నుండి ఖాసిం సాహెబ్, కాంగ్రెస్ నుండి గౌస్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News