తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 18 ,19 తేదీలలో రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ జిల్లాలో పర్యటించనున్నారని విధులు కేటాయించిన అధికారులు పర్యటన విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కె .వెంకటరమణారెడ్డి సూచించారు. ఆదివారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర గవర్నర్ పర్యటనపై శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ భారతి,నగరపాలక కమిషనర్ హరిత, జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర గవర్నర్ ఈనెల 18న సోమవారం ఉదయం10.30గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకొని తిరుపతి శ్రీ పద్మావతి అతిథి గృహంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో జరగనున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్న సంక్షేమ శాఖలు ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేయాలని, ఆడిటోరియంలో అవసరమైన బ్యాక్ డ్రాప్, పి ఎ.సిస్టం వంటి ఏర్పాట్లు జాగ్రత్తగా చూడాలని సూచించారు. అనంతరం తిరుమల చేరుకుని రాత్రి బస చేయనున్నారని ఈ నెల 19న ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారని, సాయంత్రం 4.30గంటలకు రేణిగుంట రైల్వే స్టేషన్ చేరుకొని ధురంతో ఎకస్ప్రెస్ లో విజయవాడ వెళ్ళనున్నారని కలెక్టర్ తెలిపారు. గౌరవ రాష్ట్ర గవర్నర్ పర్యటనలు చిన్నపాటి పొరపాట్లకు కూడా తావివ్వరాదని సూచించారు.
ఈ సమీక్షలో అడిషనల్ ఎస్పీలు వెంకట్రావు, కులశేఖర్ , జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, ఆర్డీవోలు నిశాంత్ రెడ్డి, కిరణ్ కుమార్, చంద్రముని నగరపాలక డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి, స్మార్ట్ సిటీ జి ఎం చంద్రమౌళి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News