విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సెంట్రల్ నియోజకవర్గం అసెంబ్లీ సీటును వైసీపీ అధిస్థానం ప్రస్తుత ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కేటాయించకపోవడంపై బ్రాహ్మణ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. గాంధీనగర్లోని ఓ ప్రముఖ హోటల్లో బుధవారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో పలు బ్రాహ్మణ సంఘాల నేతలు తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనూరు సతీష్శర్మ మాట్లాడుతూ బ్రాహ్మణుల అధికంగా ఉండి, గెలిచే సీట్లను ముఖ్యమంత్రి ఇతరులకు ఇవ్వడం అన్యాయమన్నారు. సుమారు 48 వేలకు పైగా బ్రాహ్మణులున్న సెంట్రల్ సీటును మల్లాది విష్ణుకు కేటాయించాలని, సీఎం జగన్ పునారాలోచించుకోవాలని కోరారు. బ్రాహ్మణులను విస్మరించడం తగదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బ్రాహ్మణులకు 4 అసెంబ్లీ సీట్లు కేటాయించాలని కోరుతూ ఆదివారం నగరంలో అన్ని రాజకీయ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ద్రోణంరాజు రవికుమార్, శర్వాణిమూర్తి, చల్లా సుధాకర్, కొప్పరపు బలరామకృష్ణమూర్తి, దుమ్మలపాటి చంద్రశేఖర్, కౌతా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News