– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-ఎమ్మెల్యే చేతులమీదుగా విద్యార్థులకు భౌతిక శాస్త్ర అభ్యాస దీపికలు పంపిణీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థి దశలో పదవ తరగతి ఎంతో కీలకమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 62వ డివిజన్ ఎల్బీఎస్ నగర్లోని పుచ్చలపల్లి సుందరయ్య హైస్కూల్ నందు పదవ తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే చేతులమీదుగా శనివారం భౌతిక శాస్త్ర అభ్యాస దీపికలను పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు డాక్టర్ మైనం హుస్సేన్ నగరపాలక సంస్థ విద్యార్థులకు ఏటా అభ్యాస దీపికలు ఉచితంగా అందిస్తుండటం అభినందనీయమని మల్లాది విష్ణు అన్నారు. స్వీయ అభ్యాసంతో విద్యార్థులు అన్ని ముఖ్యాంశాలను సులభంగా అర్థం చేసుకునేలా విద్యా ప్రమాణాల ఆధారంగా వీటిని రూపొందించడం జరిగిందన్నారు. ఈ అభ్యాస దీపికలలో నిర్వచనాలు, విలువలు, సూత్రాలు, రీజనింగ్, డయాగ్రమ్స్ ఉంటాయని తెలిపారు. వంద శాతం ఉత్తీర్ణత సాధనతో పాటు విద్యార్థుల్లో ఒత్తిడిని దూరం చేసేందుకు ఈ బుక్స్ ఉపయోగపడతాయన్నారు. కనుక ప్రణాళికబద్ధంగా చదివితే పరీక్షలలో 10 జీపీఏ సాధించడం కష్టమేమీ కాదని మల్లాది విష్ణు అన్నారు. మార్చి 18 నుంచి 30 వరకు పబ్లిక్ పరీక్షలు జరుగనున్న నేపథ్యంలో గతంలో కంటే ఈ సారి మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు డి.మోహన్, నాయకులు అలంపూర్ విజయ్, వీరబాబు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News