విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్.టి.ఆర్.జిల్లా విజయవాడ నగరం అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిదిలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియం నందు పేదలకు ఇళ్ళపట్టాల పంపిణీ మరియు కృష్ణ లంక పోలీస్ స్టేషన్ పరిదిలోని కృష్ణా కరకట్ట రెండు, మూడో దశల రక్షణ గోడలతో పాటు రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిధిగా వస్తున్న సందర్భంగా ఆయా ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్న కట్టు దిట్టమైన భద్రత, పటిష్ట బందోబస్తు ఏర్పాట్లపై *నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్., జిల్లా కలెక్టర్ డిల్లీ రావు ఐ.ఏ.ఎస్., విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, ఇతర అధికారులతో కలిసి శనివారం మాకినేని బసవపున్నయ్య స్టేడియంను పర్యవేక్షించి సభా వేదిక ఏర్పాటు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల పార్కింగ్, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరక్కుండా చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లు, సభాస్థలి ప్రాంగణంలో చేయాల్సిన ఏర్పాట్లు మొదలగు అంశాలపై చర్చించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులమీదుగా కృష్ణా కరకట్ట రెండు, మూడో దశల రక్షణ గోడలతో పాటు రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో కృష్ణలంక రాణిగారితోట ప్రాంతాన్ని పరిశీలించి భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ నేపధ్యంలో ఈ కార్యక్రమాలకు విచ్చేయు ప్రముఖులకు మరియు ప్రజలకు లా & ఆర్డర్ మరియు ట్రాఫిక్ పరంగా ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు, బందోబస్తు ఏర్పాట్లలో ఎక్కడా అలసత్వం ప్రదర్శించకుండా భద్రతా పరంగా ఎటువంటి చిన్న లోపాలు లేకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి ఆదేశాలు జారీచేయడంతో పాటు, తగు సూచనలను అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డి.సి.పి.లు అధిరాజ్ సింగ్ రాణా ఐ.పి.ఎస్., కె.చక్రవర్తి, టి.హరికృష్ణ, జాయింట్ కలెక్టర్ పి.సంపత్ కుమార్, ఏ.డి.సి.పి.లు టి.నాగరాజు, డి.ప్రసాద్, ఏ.సి.పి.లు ఇతర శాఖల అధికారులు, మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News