విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుణదల ప్రాంత ప్రజలు ఎంతోకాలంగా ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించనుందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గుణదలలో రైల్వే ఓవర్ బ్రిడ్జిని (LC No.8) వందశాతం రైల్వే నిధులతో గతిశక్తి ప్రాజెక్టు కింద చేపట్టి పూర్తిచేయవలసిందిగా గత నెల 5వ తేదీన రైల్వే బోర్డు ఛైర్ పర్సన్ జయవర్మ సిన్హాను ఎంపీలు కేశినేని నాని, అయోధ్య రామిరెడ్డితో పాటు ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఢిల్లీలోని రైల్ భవన్లో కలిసి విన్నవించింది తెలిసిందే. ఈ నేపథ్యంలో సమగ్ర సర్వే నిర్వహించి అంచనాలు సిద్ధం చేయవలసిందిగా కేంద్ర రైల్వే బోర్డు నుంచి ఆదేశాలు రావడంతో బుధవారం రైల్వే అధికారులు సర్వే చేపట్టారు. ఈ పనులను సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (గతిశక్తి) ఎస్.శ్రీనివాసరావుతో కలిసి ఎమ్మెల్యే మల్లాది విష్ణు పర్యవేక్షించారు. ఇప్పటికే రూ. 12.50 కోట్ల నిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్.ఓ.బి.కి అవసరమైన భూసేకరణను పూర్తిచేసినట్లు ఎమ్మెల్యే గుర్తుచేశారు. సర్వే అనంతరం జీఏడీ మరియు ఆర్ అండ్ బి శాఖల సమన్వయంతో సమగ్ర నివేదికను సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ కు పంపడం జరుగుతుందన్నారు. అక్కడి నుంచి రైల్వే బోర్డుకు వెళుతుందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో జూన్ మాసం కల్లా పనులు ప్రారంభించి.. ఏడాది కాలంలో వంతెనను పూర్తిచేయాలనే కృత నిశ్చయంతో ముందుకు వెళ్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే LC No.316 వంతెన నిర్మాణం ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట నాయకులు ఉద్ధంటి సురేష్, కొండా మహేష్ రెడ్డి, ఆళ్ల ప్రసాద్ రెడ్డి, నాగరాజు తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News