విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ రోజు నగర పోలీస్ కమిషనర్ పి.హెచ్.డి. రామకృష్ణ ఐ.పి.ఎస్. రూరల్ డివిజన్ పరిదిలోని జగ్గయ్యపేట, నందిగామ పోలీస్ స్టేషన్ లను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ పోలీస్ స్టేషన్ల పరిదిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను, ఈ.వి.ఎం.లను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించినారు. అదేవిధంగా సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో ఏర్పాటు చేసిన సరిహద్దులో ఉన్న గరికపాడు మరియు గుంటుపల్లి చెక్ పోస్ట్ లను పరిశీలించారు. నగర పోలీస్ కమిషనర్ జగ్గయ్యపేట, నందిగామ పోలీస్ స్టేషన్ లను ఆకస్మికంగా తనిఖీ చేసి, పోలీస్ స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరు, విధులు పరిశీలించి అధికారులకు పలు సూచనలు మరియు సలహాలను ఇవ్వడం జరిగింది.
సదరు చెక్ పోస్ట్ ల వద్ద వాహనాల రాకపోకలను, వాటి తనిఖీలను పరిశీలించి, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున చెక్ పోస్టు సిబ్బంది ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి అక్రమ నగదు, మద్యం, నాటు సారా మొదలగు ఇతర అక్రమ రవాణాలను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి అని అన్నారు. సిబ్బంది నిరంతరం వాహన తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. నగదు, మద్యం మొదలగునవి పట్టుబడిన యెడల తక్షణమే అధికారులకు సమాచారం అందించి తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహించకుండ అప్పగించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలని పలు అంశాలపై చెక్ పోస్టు సిబ్బందికి నగర పోలీస్ కమిషనర్ గారుసూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ పి.హెచ్.డి.రామకృష్ణ ఐ.పి.ఎస్. తో పాటు రూరల్ డి.సి.పి. కె.శ్రీనివాసరావు ఐ.పి.ఎస్., ఇతర పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News