విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో ఎన్డిఎ ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలుతోందని కాంగ్రెస్ పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ విమర్శించారు. శుక్రవారం గాంధీనగర్లోని ప్రెస్క్లబ్లో శుక్రవారం పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం వచ్చాక సామాన్యులు జీవించలేని పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ధరలను స్థిరీకరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయన్నారు. బిజెపి పాలిత రాష్ట్రమైన మహారాష్ట్రలో ఐఎఎస్ అధికారుల పోస్టింగుల కోసం మంత్రులు రూ.ఐదు కోట్లతో వేలం నిర్వహించడం సిగ్గుచేటని, ఇది ఎన్డిఎ అవినీతికి పరాకాష్ట అని అన్నారు. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచి ఉపాధి వెతుక్కుంటూ రోజూ వేలాదిమంది వలస పోతున్నారని అన్నారు. కుప్పం నుంచి కర్ణాటకకు వెళ్లే రైళ్లన్నీ వలస కార్మికులతో నిండుతున్నాయన్నారు. ఇప్పటివరకు పోలవరం నిర్వాసితులకు ఎంత ఖర్చు చేశారో చెప్పాలన్నారు. రాష్ట్రంలో 2004 నుంచి 2024 మధ్య కాలంలో పోలవరం ప్రాజెక్టుకు ఎన్ని వేల కోట్లు ఖర్చు చేశారు? నిర్మాణ పనులు ఎవరికి అప్పగించారనే అంశంపై జ్యుడీషియల్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. 2019లో రూ.2.65 లక్షల కోట్ల అప్పులు వున్న రాష్ట్రంలో ఇప్పుడు రూ.14 లక్షల కోట్లకు పెరిగిందని అంటున్నారని, ఈ పెరిగిన అప్పులతో ఏఏ అభివృద్ధి పనులు చేపట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. నెలకు రూ.9 వేల కోట్లు వడ్డీలు కట్టాల్సి వస్తోందని చింతా మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ చేసిన అప్పులపై వివరాలు తెలియజేయాల్సిన భాద్యత సీఎం చంద్రబాబుపై ఉందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచి ఏవిధగా కాపాడుతారో చెప్పాలని డిమాండ్ చేశారు.
Prajavartha Online Telugu News