Breaking News

జగనన్న కాలనీల్లో జగమంత అవినీతి

-స్థలాల కొనుగోళ్ల, ఇళ్ల నిర్మాణంలో భారీ అవకతవకలు
-ఏ లే అవుట్ చూసినా రూ.వందల కోట్ల పక్కదారి
-పేదల ఇళ్ల పేరుతో పెద్దలు ఆడిన అవినీతి నాటకం
-పేదల ఇళ్ల పథకం పై సమగ్ర విచారణ జరగాలి
-కాంట్రాక్టర్లు పూర్తిస్థాయిలో పనులు చేయాల్సిందే
-తెనాలి నియోజకవర్గంలో లే అవుట్లను పూర్తిస్థాయిలో పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్ 

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
‘ప్రజా ధనాన్ని కొల్లగొట్టి సొంత ఆస్తులను పెంచుకోవడానికే గత పాలకులు జగనన్న కాలనీల పథకం తీసుకొచ్చారు తప్ప పేదలకు మేలు చేయడానికి కాద’ని ఆహార, పౌర సరఫరాల శాఖామాత్యులు నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. పేదల ఇళ్ల స్థలాల కోసం భూముల కొనుగోళ్లనూ, గృహ నిర్మాణంలోనూ భారీ అవినీతికి పాల్పడ్డారని అన్నారు. రైతుల నుంచి ఎకరా కోటి రూపాయలకు కొనుగోలు చేసి ప్రభుత్వానికి నాలుగైదు రెట్లు ఎక్కువకు విక్రయించి భారీగా ప్రజాధనాన్ని లూటీ చేశారని చెప్పారు. ప్రజా ధనాన్ని దోచుకున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, సమగ్ర విచారణ జరిపించి బాధ్యులను శిక్షిస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇళ్ల నిర్మాణానికి ఇస్తున్న ఆర్థిక సాయాన్ని త్వరలోనే పెంచుతామని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఆదివారం తెనాలి నియోజకవర్గంలో గృహ నిర్మాణం, ఇళ్ల స్థలాల పట్టాలు సమస్యలపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకు ముందు పెదరావూరు, సిరిపురం, దావులూరు ప్రాంతాల్లో పేదల కోసం నిర్మిస్తున్న లే అవుట్లను పరిశీలించారు. లబ్ధిదారులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలనీల్లో కనీస మౌలిక వసతులు లేకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవగాహన సదస్సులో మనోహర్  మాట్లాడుతూ “కాగితాల్లో చూపించిన దానికి, వాస్తవ పరిస్థితికి అసలు పొంతన లేదు. వందల కోట్లు ఖర్చు అయినట్లు చూపిస్తున్నారు తప్ప కనీసం కాలనీల్లో మౌలిక వసతులు కల్పించలేకపోయారు.

చెరువుల్లా మారిన లే అవుట్లు
చిన్నపాటి వర్షానికి లే అవుట్లు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లు, డ్రైనేజీ, తాగు నీరు, కరెంటు.. ఇలా ప్రతీది సమస్యే. పట్టాలు ఇచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా లబ్ధిదారులు తమకు మంజూరు చేసిన స్థలం ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి. మరికొంత మంది లబ్ధిదారులను ఇళ్లు నిర్మిస్తామని డబ్బులు తీసుకొని కాంట్రాక్టర్లు మోసం చేశారు. అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిపోతున్నాయి. ముఖ్యంగా గంజాయి బ్యాచ్, మందు బాబులు రెచ్చిపోతున్నారు. సొంతింటి కోసం కలలు కన్న ప్రతి పేదవాడికి న్యాయం జరిగేలా చేస్తాం. వచ్చే ఉగాది నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారుల ముఖాల్లో సంతోషం నింపుతాం.

78 ఎకరాలు… రూ.399 కోట్లా..?
పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం పెదరావురులో 78 ఎకరాల స్థలం కొన్నారు. ఇక్కడ రైతుల నుంచి ఎకరా రూ.90 లక్షల నుంచి కోటి రూపాయలకు కొనుగోలు చేశారు. ప్రభుత్వానికి మాత్రం రూ.399 కోట్లకు విక్రయించారు. ఇక్కడ ఒక్క చోటే దాదాపు రూ.300 కోట్ల ప్రజాధనం దోచుకున్నారు. ఈ లే అవుట్లో 3792 మంది లబ్ధిదారులకు ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. మొదటి విడతలో 1900 ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. నాలుగేళ్లు అవుతోన్న ఇప్పటికి నిర్మించింది 489 ఇళ్లే. అది కూడా అరకొర వసతులతో. అలాగే సిరిపురం లేఅవుట్ లో 9735 లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు అయ్యాయి. మొదటి విడతలో 3338 ఇళ్లు నిర్మించాలి. కానీ ఇప్పటికి నిర్మించింది 250 ఇళ్లే. నివాసం ఉంటున్నది మూడు కుటుంబాలే. దవులూరు లే అవుట్లో 356 ఇళ్లు మంజూరు అయితే పూర్తి చేసింది 86 మాత్రమే. ప్రతి లే అవుట్లో సవాలక్ష సమస్యలు. బటన్లు నొక్కా… బటన్లు నొక్కా అని పదే పదే చెప్పిన జగన్ ఎవరికి లబ్ధి చేకూర్చారో మాత్రం చెప్పలేదు.

నెల రోజులు సమయం ఇవ్వండి
తెనాలి నియోజకవర్గం పరిధిలో ఉన్న మూడు లేఅవుట్లను వీలైనంత త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. వచ్చే ఉగాదికి ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేసి గృహ ప్రవేశాలు జరిగేలా చేస్తాం. అంతకు ముందు ఈ నెల రోజుల్లో ఎవరి ఇళ్ల స్థలం ఎక్కడుందో అర్థమయ్యే విధంగా లేఅవుట్ బయట రోడ్ నెంబర్, ఫ్లాట్ నెంబర్ తో బోర్డులను ఏర్పాటు చేస్తాం. లబ్ధిదారులను మోసం చేసిన కాంట్రాక్టర్లకు రెండు వారాల సమయం ఇస్తున్నాం. మధ్యలో వదిలేసిన ఇళ్ల నిర్మాణ పనులు మొదలు పెట్టకపోతే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. కాలనీల్లో నివాసం ఉంటున్న కుటుంబాలకు రక్షిత మంచినీటిని అందించే ఏర్పాటు చేస్తాం. గృహ నిర్మాణ శాఖ నుంచి లబ్ధిదారులకు రావాల్సిన బకాయిలను విడుదల అయ్యేలా చేస్తాం. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం. తెనాలి నియోజకవర్గంలో ఉన్న ఈ మూడు లేఅవుట్లను ఆదర్శవంతమైన కాలనీలుగా తీర్చిదిద్దుతాం.

కదిలి వచ్చిన యంత్రాంగం
గృహ నిర్మాణం, ఇళ్ల స్థలాల పట్టాలు సమస్యలపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సుకు జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కదిలివచ్చింది. గృహ నిర్మాణం శాఖ, మున్సిపల్, రెవెన్యూ, పోలీస్, ఆర్ డబ్ల్యూ ఎస్, పంచాయతీ రాజ్, ట్రాన్స్ కో, పబ్లిక్ హెల్త్ డిపార్టమెంట్ అధికారులు హాజరై లబ్ధిదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఇందు కోసం లేఅవుట్ల దగ్గర ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. అలాగే గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో లబ్ధిదారుల కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని నాదెండ్ల మనోహర్ ఆదేశించారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *