మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
బుడమేరు ముంపు బాధిత గ్రామాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ, జలవనరుల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి బుడమేరు వరద పరిస్థితి పై సమీక్షించారు. బుడమేరు, రైవస్, బందరు, కె.ఈ.బి. బంటుమిల్లి కాలువల ప్రవాహం గురించి రేఖా చిత్రపటం ద్వారా జిల్లా కలెక్టర్కు జలవనరుల శాఖ డి ఈ సూర్య భరత్ వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బుడమేరులో వరద నీటి ప్రవాహం ఉదృతంగా ఉన్నందున మరో 4, 5 గ్రామాల ప్రజలను కూడా వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ముఖ్యంగా రుద్రపాక, జొన్నపాడు, నందివాడ, ఇలపర్రు, గాజులపాడు గ్రామాల్లోని 500 మంది ప్రజలను వెంటనే ప్రత్యేకమైన బస్సులు, ట్రాక్టర్లు ఏర్పాటు చేసి పునరావాస కేంద్రాలైన వీకే ఆర్ వి ఎన్ వి కళాశాల, గుడివాడ మినీ బైపాస్ లో ఉన్న బర్న్ బాస్ శాంతి గిరి ఆశ్రమానికి తీసుకొని రావాలన్నారు. బుడమేరులో వరద ఉధృతి మరింత పెరిగితే ఆ గ్రామాల నుండి మరో 1000 మందిని కూడా తీసుకొని రావలసి ఉంటుందన్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు. బుడమేరు ఉప్పొంగి గ్రామాల్లోకి నీరు వస్తుంటే ప్రజలు అక్కడే ఉండటం క్షేమం కాదని, ప్రభుత్వం పిలుపు మేరకు ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలి వచ్చేందుకు సిద్ధం కావాలని, పరిస్థితి విషమించేంతవరకు ఆగరాదని ప్రజలకు తెలియజేసి వారిని అక్కడి నుండి తీసుకుని రావాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో గుడివాడ ఆర్డిఓ పి పద్మావతి, తహసిల్దారు మల్లిక, ఎం వి ఐ లు సంగీతరావు నారాయణస్వామి, జలవనుల శాఖ డి సూర్య భరత్ తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News