-మీ కష్టాలలో చంద్రబాబు నాయుడు తోడుగా ఉంటారు…
-వ్యవసాయ శాఖ కమిషనర్ ఎస్. డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అనుకోకుండా సంభవించిన విపత్తులో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తోడుగా ఉంటుందని వ్యవసాయ శాఖ కమిషనర్ ఎస్. డిల్లీరావు వరద బాధితులకు భరోసా ఇచ్చారు. ఇటీవల సంభవించిన వరదల్లో నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం నిత్యావసరాలతో కూడిన కిట్ ను అందిస్తానని ఇచ్చిన హామీలో భాగంగా కృష్ణలంకలోని 16వ డివిజన్ లో డిల్లీ రావు బాధితులకు శుక్రవారం అందజేశారు. డివిజన్ వరద సహాయ చర్యల పర్యవేక్షకుడిగా ఆయన 25 కేజీల బియ్యం, రెండు కేజీల ఉల్లిపాయలు, రెండు కేజీల బంగాళదుంపలు, ఒక కేజీ పంచదార, చింతపండు, పామోలిన్ ఆయిల్ ఒక లీటర్ తో కూడిన ఈ కిట్లను వెయ్యి మంది బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదల్లో నష్టపోయిన ప్రతి బాధితునికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. నష్టపోయిన ప్రతి ఒక్కరూ సాధారణ జీవిత స్థాయికి వచ్చేంతవరకు అవసరమైన ప్రతి సహాయాన్ని సొంత వారి కంటే మిన్నగా ప్రభుత్వం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం వేగవంతంగా అమలు చేస్తోందని వివరించారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధితులకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఆయన వరద బాధిత పర్యటన సమయంలో చెప్పిన మాట ప్రకారం ఈ నిత్యావసర వస్తువుల పంపిణీని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసిన విషయం గుర్తు చేశారు. రానున్న రోజుల్లో వరద బాధితులకు కలిగిన ప్రతి నష్టాన్ని పూరించేందుకు శక్తి వంచన లేకుండా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. వరద బాధితులకు అవసరమైన సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షించేందుకు తనకు ఇచ్చిన ఈ బాధ్యతలను నిర్వహించేందుకు పారదర్శకంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. వరదల కారణంగా సంభవించిన నష్టాన్ని ప్రభుత్వానికి తెలియజేసేందుకు ప్రతి ఇంటికి త్వరలో అధికారులు వస్తారని చెప్పారు. పారిశుధ్యం, ఆరోగ్య అంశాలలో సైతం ప్రభుత్వం సంతృప్తికర స్థాయిలో ఏర్పాటు చేస్తుందన్నారు. ఇప్పటికే డివిజన్ పరిధిలోని వరద బాధితుల కోసం వైద్య శిబిరాలు నిర్వహిస్తోందని, బురదతో నిండిపోయిన ఇళ్లను శుభ్రం చేసేందుకు వినూత్న రీతిలో ఫైర్ వాహనాలను సైతం వినియోగిస్తోందన్నారు. బాధితులు ఎవరూ తమకు సహాయం అందలేదని ఆందోళన చెందవద్దని, వరుస క్రమంలో ప్రతి ఒక్కరికీ సహాయం అందించేందుకు కొంత సమయం పడుతుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయం ఇంతటితో ఆగదని, రానున్న రోజుల్లో మరింత సహాయం అందించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. బాధితుల ఆరోగ్య పరిరక్షణ కోసం నగరపాలక సంస్థ కూడా చాలా బాధ్యతాయుతంగా పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News