మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
బంటుమిల్లి కాలువ సమీపంలోని పాతులూరు గ్రామ ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ పెడన మండలం లంకల కలవగుంట గ్రామంలోని బంటుమిల్లి కాలువను పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ తో కలసి పరిశీలించారు.
ఈ సందర్భంగా బంటుమిల్లి కాలువలో వరద నీటి ప్రవాహం గురించి వివరాలను కలెక్టర్ జలవనుల శాఖ డి ఈ సూర్య భరత్ ను అడిగారు. అందుకు డి ఈ సమాధానం చెబుతూ బుడమేరు నుండి వరద నీరు వస్తుందని, ప్రస్తుతం 600 క్యూసెక్కులు ప్రవహిస్తోందన్నారు. ఇప్పటికే కాలువ నిండిపోయిందన్నారు. వరద ఉధృతి మరో 200 క్యూసెక్కులు పెరిగే అవకాశం ఉందని దీంతో చుట్టుపక్కల ఉన్న వరి పంట పొలాలన్ని ముంపునకు గురవుతాయన్నారు.
అంతేకాకుండా సమీపంలోని లోతట్టు ప్రాంతమైన పాతులూరు గ్రామంలోకి నీరు చేరుకుని ప్రజలు ఇబ్బందికి గురి అయ్యే పరిస్థితి ఉందని డి ఈ కలెక్టర్కు వివరించారు. వరి పంట వేసి నెలరోజులు అవుతుందని తమ పంట పొలాలను ముంపుకు గురి కాకుండా కాపాడాలని రైతులు జిల్లా కలెక్టర్ ను కోరారు.
దీంతో జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ బుడమేరు నుండి వరద నీరు రాకుండా డైవర్షన్ కాలువ ద్వారా నీటిని మళ్లించే ప్రయత్నం చేయాలన్నారు. పాతులూరు గ్రామ ప్రజలను ఏదో రకంగా ఒప్పించైన లేదా ఒత్తిడి తెచ్చైనా వారిని అక్కడి నుండి సురక్షిత ప్రాంతానికి తరలించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం కావలసినన్ని ట్రాక్టర్లను, ఇసుక మూటలు సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు.
ఇప్పటివరకు జిల్లాలో ఒక్క ప్రాణం నష్టం కూడా జరగలేదని ఇకపైన కూడా ప్రాణ నష్టం జరగరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. 7 నెలలు ఆపైన నిండిన గర్భవతులు గాని డయాలసిస్ రోగులు గాని ఉంటే వెంటనే జాగ్రత్తగా తీసుకుని రావాలన్నారు. అవసరమైన చోట సురక్షితమైన ప్రాంతాల్లో పునరావస కేంద్రాలను ఏర్పాటు చేయాలని, నిధుల కొరత లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. బంటుమిల్లి కాలువపై వంతెన కొంత దెబ్బతినిందని మరమ్మతులు చేయించాలని రైతులు కోరగా పరిశీలిస్తామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు.
ఈ పర్యటనలో కలెక్టర్ వెంట మచిలీపట్నం ఆర్డిఓ ఎం వాణి, బంటుమిల్లి తహసీల్దారు పూర్ణచంద్రరావు, జల వనరుల శాఖ డి ఈ సూర్య భరత్, డ్రైనేజీ డి ఈ మురళి తదితర అధికారులు, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News