విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అస్నా తుఫాన్ కారణంగా ఏర్పడిన వరద తాకిడికి బుడమేరు వాగుకి పడిన మూడు గండ్లను పూర్తి పూడ్చివేశారు. దీంతో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం ఆగిపోయింది. ముందుగా వరద కారణాంగా నగరంలో ఏర్పడిన డ్యామేజీని కంట్రోల్ చేసి పరిస్థితుల్ని సాధారణ స్థితికి తీసుకువచ్చిన తక్షణం భవిష్యత్తులో విజయవాడకి ఎంత వరద వచ్చినా ఎలాంటి నష్టం వాటిల్లకుండా నగరాన్ని తీర్చిదిద్దుతామని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాయలంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర ఏర్పాటు చేసిన మీడియా పాయింట్ లో మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే యార్లగడ్డ రవీంద్రతో కలిసి మీడియా తో మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో ముందుగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ప్రజలందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. పండగ పూట కూడా సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లకుండా వరద బాధితులకి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసేందుకు కలెక్టర్ కార్యాయలం వుండి సహాయక చర్యలను సమీక్షిస్తున్నారన్నారు.
భారీ వర్షాలు కారణంగా బుడమేర వాగుకి పడిన మూడు గండ్లను మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో పూడ్చివేసినట్లు తెలిపారు. మంత్రి నారా లోకేష్ కూడా మూడో గండి వూడ్చి వేత పనులను దగ్గర వుండి పరిశీలించారని తెలిపారు. మూడో గండి వద్ద పూడ్చివేతను ఒకవైపు ఏజెన్సీలు చేయగా.. మరోవైపు ఆర్మీ జవాన్లు రంగంలోకి దిగి పూర్తి చేసినట్లు చెప్పారు. విజయవాడ నగర చరిత్రలో ఎన్నడూ చూడని వరద విధ్వంసం సృష్టించింది. ఆ విధ్వంసం నుంచి నగరాన్ని, వరద బాధితుల్ని రక్షించేందుకు సీఎం చంద్రబాబు నిరంతరం కష్టపడుతున్నారన్నారు. ఇంకా నగరంలో జక్కంపూడి కాలనీ, సింగ్ నగర్ లోని 5 డివిజన్లు నీటిలోనే వున్నట్లు చెప్పారు. వరద తగ్గిన ప్రాంతాల్లో రోడ్లు, ఇళ్లు ఫైరింజన్స్ తో శుభ్రపరిచే కార్యక్రమం రెండు రోజుల్లో పూర్తవుతుందన్నారు. అలాగే నగరంలో శానిటేషన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నట్లు ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు.
అనంతరం రాష్ట్ర మైన్స్ జియాలజీ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సర్వవిఘ్నాలు తొలగాలని విజయవాడ కలెక్టరేట్లో వినాయక చవితి పూజ నిర్వహించినట్లు తెలిపారు. పండగ పూట కూడా నిద్రాహారాలు మాని రాష్ట్ర ప్రజల కోసం పరితపిస్తున్న వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. గత వారం రోజులుగా ప్రభుత్వ యంత్రాంగం విజయవాడ నగరాన్ని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు కష్టపడుతుందన్నారు. రెండు రోజుల్లో సాధారణ పరిస్థితి నెలకొనేలా యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ముంపు ప్రాంతాల్లో తాగునీరు, ఆహారం, పాలు, మెడిసిన్స్ తో నిత్యావసరాలు సరఫరా కొనసాగుతున్నట్లు తెలిపారు…విజయవాడలో ప్రస్తుత పరిస్థితులకు గత ప్రభుత్వమే కారణమంటూ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు.
Prajavartha Online Telugu News