-అధికారులకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ హరికిరణ్ ఆదేశాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో 19 లక్షల మంది ఎస్టీ జనాభా ఉండగా, 9 లక్షల మంది ఎస్టీ జనాభాకు సికిల్ సెల్ అనీమియా స్క్రీనింగ్ పూర్తయ్యిందనీ, ఇంకా 10 లక్షల మందికి స్క్రీనింగ్ పూర్తి చేయాల్సి ఉందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ సి.హరికిరణ్ నేడొక ప్రకటనలో తెలిపారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో కొత్తగా అడ్మిషన్ పొందిన దాదాపు 13 వేల మంది విద్యార్థులకు మొదటి విడతలో సికిల్ సెల్ అనీమియా స్క్రీనింగ్ పూర్తి చేయాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. వివిధ శాఖల సమన్వయంతో జాతీయ సికిల్ సెల్ అనీమియా నిర్మూలనా మిషన్ (Implementation of National Sickle cell Anemia Elimination Mission) అమలుపై చర్చించేందుకు వైద్యఆరోగ్య శాఖ ఇటీవల జాతీయ ఆరోగ్య మిషన్ (National Health Mission) మరియు గిరిజన సంక్షేమం, పాఠశాల విద్య, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ రాష్ట్ర స్థాయి అధికారులతో సమావేశాన్ని నిర్వహించింది. రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు, పాఠశాలలు కూడా జాతీయ సికిల్ సెల్ అనీమియా నిర్మూలనా మిషన్ అమలు పరిధిలోకొస్తాయని ఈ సందర్భంగా కమీషనర్ పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మరియు 9 జిల్లాల్లోని జూనియర్, డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కళాశాలలో స్క్రీనింగ్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. 21 సంవత్సరాల(పెళ్లి వయస్సుకు ముందు) కంటే తక్కువ వయస్సున్న వ్యక్తుల స్క్రీనింగ్కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వివాహానంతర సమస్యల్ని నివారించడానికి క్షేత్ర స్థాయి అధికారులకు సూచనలు ఇవ్వడం ద్వారా అర్హతగల ఎస్టీ జంటలు, ఎస్టి గర్భిణిలందరికీ మొదటి త్రైమాసికంలో స్క్రీనింగ్ నిర్వహిస్తామన్నారు. సికిల్ సెల్ వ్యాధికి పిఓసి కిట్ల ఏర్పాటు కోసం 50 శాతం గిరిజన జనాభా కంటే ఎక్కువ ఉన్న మైదాన ప్రాంతాల్లో (ఐటిడిఎ ప్రాంతాలు మినహా) పాఠశాలలు, కాలనీల వారీగా జనాభా జాబితా ఎన్ హెచ్ ఎం పీఓ వద్ద ఉంటుందన్నారు. జిల్లాలకు ఇప్పటికే పంపించిన కార్డులకు సంబంధించి సికిల్ సెల్ యాప్లో కార్డుల పంపిణీ అప్డేట్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆయన సూచించారు.
Prajavartha Online Telugu News