మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ, పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణలో అన్ని రాజకీయ పక్షాలు సంపూర్ణ సహకారం అందించాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం 2025, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ పై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమంలో భాగంగా బూత్ స్థాయి అధికారులచే ఇంటింటి పరిశీలనా కార్యక్రమం గత ఆగస్టు నెల 21వ తేదీ నుండి మొదలైందన్నారు. నిన్నటి రోజు ఆదివారం సెప్టెంబర్ 29వ తేదీ వరకు 99.11% ఇంటింటి పరిశీలన కార్యక్రమం పూర్తయిందన్నారు. జిల్లాలో మొత్తం 15,39,299 మంది ఓటర్లు ఉండగా అందులో 15,25,670 ఓటర్లను పరిశీలించడం జరిగిందని అందులో 4,698 మంది ఓటర్లు లేరని, 1803 మంది ఓటర్లు వేరే చోటికి వెళ్లారని, 4426 మంది ఓటర్లు చనిపోయారన్నారు. ఇంకనూ 13,629 మంది ఓటర్లను పరిశీలించాల్సి ఉందన్నారు. ఆ ప్రకారం ఇప్పటివరకు 15,39,299 మంది ఓటర్లు ఉన్నారన్నారు. జిల్లాలో మొత్తం 6,7, 8 పారాలకు సంబంధించి 4,25,272 క్లైములు అందగా 4,20,849 క్లైములుపరిష్కరించామని 4,423 క్లైములుపెండింగ్లో ఉన్నాయన్నారు.
హేతుబద్దీకరణలో భాగంగా అవనిగడ్డ నియోజకవర్గంలోని 9 పోలింగ్ కేంద్రాల నామకరణం లో మార్పు చేస్తు ప్రతిపాదనలు పంపుతున్నామన్నారు. గన్నవరంలో ఒకటి, పెడనలో ఒకటి,మచిలీపట్నంలో 3, పెనమలూరులో ఒకటి మొత్తం 6 చోట్ల కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపడం జరుగుతుందన్నారు. ఆ ప్రకారం మొత్తం జిల్లాలో 1763 నుండి 1769 పోలింగ్ కేంద్రాలకు పెరిగాయన్నారు. ఈ ప్రతిపాదనలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని కలెక్టర్ కోరగా అందరూ సమ్మతం తెలిపారు. కృష్ణ-గుంటూరు శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గానికి ఈరోజు సోమవారం పబ్లిక్ నోటీసు జారీ చేయడం అయినదని,మరలా మొదటి నోటీసు ప్రచురణ అక్టోబర్ 16వ తేదీన ఉంటుందని, మరల రెండవ నోటీస్ ప్రచురణ అక్టోబర్ 25వ తేదీన ఉంటుందన్నారు. పట్టభద్రుల ఓటర్లు గా పేరు నమోదు కావడానికి వచ్చే నవంబర్ 6 తేదీలోగా దరఖాస్తులు అందజేయాలన్నారు. ముసాయిదా జాబితా నవంబర్ 20వ తేదీ నాటికి పూర్తవుతుందన్నారు, నవంబర్ 23వ తేదీన ముసాయిదా జాబితాను ప్రచురించడం జరుగుతున్నదన్నారు. క్లై ములు, అభ్యంతరాలు స్వీకరణ నవంబర్ 23 నుండి డిసెంబర్ 9వ తేదీ వరకు జరుగుతుందన్నారు. వచ్చే డిసెంబర్ 30వ తేదీన చివరి ఓటర్ల జాబితా ప్రచురించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రతినిధి దిలీప్ కుమార్ మాట్లాడుతూ మచిలీపట్నం నియోజకవర్గంలో ముఖ్యంగా నగరంలో 6 వ నియమం కచ్చితంగా పాటించాలని, ఒక ప్రాంతానికి చెందిన ఓట్లు వేరువేరు పోలింగ్ కేంద్రాల్లో ఉంటున్నాయని, దీంతో పోలింగ్ శాతం తగ్గిపోతుందని, పోలింగ్ కేంద్రాలకు హద్దులు లేవని భవిష్యత్తులో అలాంటి ఇబ్బందులు లేకుండా హద్దులు ఏర్పాటు చేయాలన్నారు.
దీనిపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ టౌన్ ప్లానింగ్ అధికారుల ద్వారా సచివాలయ చిత్రపటంలో ఇంటి నెంబర్ల తో సహా వేసి వచ్చే సమావేశానికి తీసుకుని రావాలని, వీలైనంత వరకు కొత్త ఇంటి నెంబర్లు ఇచ్చే ప్రయత్నం చేయాలని మున్సిపల్ కమిషనర్ కు సూచించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ కె చంద్రశేఖర రావు, ఈ ఆర్ ఓ లు శ్రీదేవి, పార్వతి, బాలసుబ్రమణ్యం, రమేష్ టిడిపి,సిపిఎం బిజెపి బీఎస్పీ జనసేన పార్టీల ప్రతినిధులు దిలీప్ కుమార్, జోన్స్ దయానంద్, కొడాలి శర్మ,పి వెంకట గజేంద్ర రావు బాలాజీ,బండ్రెడ్డి రామకృష్ణ పలువురు తహసీల్దారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News