కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు సినీ జగత్తులో ఆంధ్రుల అసమాన అత్తగారి పాత్రలో నిష్ణాతురాలిగా దశాబ్దాల పాటు తన ప్రాభవాన్ని కొనసాగించిన గొప్ప నటీమణి సూర్యకాంతం అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఆదివారం సాయంత్రం కాకినాడలో దంటు కళాక్షేత్రంలో ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ కార్యవర్గ సభ్యులు దంటు భాస్కరరావు అధ్యక్షతన సూర్యకాంతం శత జయంతి సభ ఘనంగా జరిగింది. ఈ సభకు ముఖ్య అతిధిగా విచ్చేసిన మండలి బుద్ధప్రసాద్ సూర్యకాంతం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బుద్ధప్రసాద్ మాట్లాడుతూ గడసరి అత్తగా నటిస్తూనే అనేక సందేశాత్మక, కుటుంబ కథా చిత్రాల్లో పాత్రలకు సూర్యకాంతం ప్రాణం పోసేవారన్నారు. కార్యక్రమంలో విశిష్ఠ అతిథులుగా యన్.టి.ఆర్. హెల్త్ యూనివర్శిటి విశ్రాంత ఉపకులపతి డాక్టర్ ఐ.వి.రావు, కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ సీ.ఓ.ఓ మెర్ల మురళీధర్, ఒంగోలు ఎన్.టి.ఆర్. కళాపరిషత్ కార్యదర్శి, నాటక రంగ పరిశోధకులు కందిమళ్ళ సాంబశివరావు, కాకినాడ సుధా హాస్పిటల్స్ అధినేత డాక్టర్ వాడ్రేవు రవి, ఆత్మీయ అతిథులుగా కీ॥శే॥ సూర్యకాంతం కుమారులు అనంత పద్మనాభమూర్తి (చైన్నై), చెన్నై ప్రముఖ రంగస్థల, టీవీ, చలనచిత్ర నటి, సూర్యకాంతం జీవిత కాల సాఫల్య పురస్కార గ్రహీత డబ్బింగ్ (కొమ్ము) జానకి, కాకినాడ ది యంగ్ మెన్స్ హ్యపీ క్లబ్ జనరల్ సెక్రటరీ పి.వి.రావు పాల్గొన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమములు నిర్వహించారు. కళారత్న, విశ్రాంత ప్రిన్సిపాల్ 28 నంది పురస్కారాల విజేత, విఖ్యాత రంగస్థల కళాకారులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డా॥ ఎన్.టి.ఆర్. రంగస్థల పురస్కార గ్రహీత డాక్టర్ మీగడ రామలింగస్వామి సంగీత నవావధానం నిర్వహించారు.
Prajavartha Online Telugu News