గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర పాలక సంస్ధ ప్రత్యేకంగా చేపట్టిన 90 రోజుల స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ని ముమ్మరం చేయాలని, డ్రైవ్ పర్యవేక్షణకు విధులు కేటాయించబడిన అధికారులు మరింత శ్రద్దగా పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ శుక్రవారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరాన్ని స్వచ్చ నగరంగా తీర్చిదిద్దుకోవదానికే 90 రోజుల స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టామని, డ్రైవ్ పర్యవేక్షణకు విధులు కేటాయించబడిన 22 మంది సీనియర్ అధికారులు మరింత శ్రద్ధ చూపాలన్నారు. డ్రైవ్ లో భాగంగా స్పెషల్ ఆఫీసర్లు ఉదయం 5:30, మధ్యాహ్నం 2-30 గంటలకు ప్రతీ శానిటరీ డివిజనుకు వెళ్ళి పారిశుధ్ధ్య కార్మికుల హజరు శాతము, వార్డు శానిటేషన్ కార్యదర్శుల పనిని తనిఖీ చేయాలన్నారు. ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరిగే విధంగా చూడటం, ఇంటి ఇంటి నుండి ఉత్పత్తి అయ్యె చెత్తను తడి, పొడిగా విభజించి నగర పాలక సంస్ధ ఆటో, పుష్ కార్డ్ కు అందజేసే విధంగా పర్యవేక్షణ చేయాలన్నారు. నగరంలో సేకరించే చెత్తను ఎప్పటికప్పుడు కంపోస్ట్ యార్డ్ కి తరలించాలని, ట్రాక్టర్లు, ఆటోల మీద మైకులు ఏర్పాటు చేసి ప్రజలు రోడ్ల మీద చెత్త వేయకుండా ఉండే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ కి అంతరాయం కల్గించే ఆవులను పట్టించి ప్రత్యేక వాహనముల ద్వారా నగరపాలక సంస్ధ బందెల దొడ్డికి తరలించడం, వీధి కుక్కలను పట్టించి ఏబిసి ఆపరేషన్లు, వ్యాక్సిన్ కార్యక్రమములు తనిఖీ చేయాలని తెలిపారు. శివారు కాలనీలలో ప్రత్యేక పారిశుధ్ధ్య కార్యక్రమములు (గ్యాంగ్ వర్క్) ద్వారా కాలువలు, వీధులు శుభ్రపర్చటం వంటి కార్యక్రమాల ద్వారా మొత్తం 90 రోజులలో గుంటూరు నగరాన్ని స్వఛ్ఛ గుంటూరుగా తీర్చి దిద్దే విధంగా ప్రణాళికల ద్వారా పర్యవేక్షణ జరుగుచున్నది. స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ని అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు, సిఎంఓహెచ్, ఎంహెచ్ఓలు ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నార తెలిపారు.
Prajavartha Online Telugu News