
– ఆధునిక చికిత్సలతో ప్రజలకు మరింత మెరుగైన చికిత్సలు
– యలమంచి డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ డయాబ్ ఎండో కాన్ 2024లో వక్తలు
– పలు అంశాలపై నిపుణుల విశ్లేషణాత్మక ప్రసంగాలు
– 500 మందికి పైగా వైద్యుల హాజరు
– ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ కృష్ణ శేషాద్రికి గోల్డ్ మెడల్ ప్రదానం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మధుమేహం, ఎండోక్రైనాలజీ చికిత్సల్లో విప్లవాత్మక ఆవిష్కరణలు చోటుచేసుకున్నాయని యలమంచి డయాబెసిస్ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్మన్, ప్రఖ్యాత డయాబెటాలజిస్ట్ డాక్టర్ యలమంచి సదాశివరావు తెలిపారు. వైడీఆర్ఎఫ్ డయాబ్ ఎండో కాన్ 2024 సదస్సు నగరంలోని జీఆర్టీ గ్రాండ్ హోటల్లో ఆదివారం జరిగింది. ఈ సదస్సులో డాక్టర్ సదాశివరావు ప్రసంగిస్తూ.. మధుమేహం, ఎండోక్రైనాలజీ విభాగాలకు సంబంధించి అందుబాటులోకి వచ్చిన ఆధునిక చికిత్సా విధానాలతో ప్రజలకు మరింత మెరుగైన చికిత్సలు అందించేందుకు అవకాశం లభిస్తుందని అన్నారు. అత్యాధునిక పరిజ్ఞానం, నవీన ఆవిష్కరణల గురించి డయాబ్ ఎండో కాన్ 2024లో సమగ్రంగా చర్చించించినట్లు చెప్పారు. నూతన చికిత్సా విధానాల గురించి వైద్య నిపుణులు అవగాహన పెంపొందించుకునేందుకు ఈ సదస్సు అద్భుతమైన వేదికగా నిలిచిందని డాక్టర్ సదాశివరావు తెలిపారు. దాదాపు 500 మంది వైద్యులు హాజరైన ఈ సదస్సులో 25 మంది ప్రముఖ వైద్య నిపుణులు వివిధ అంశాలపై ప్రసంగించారు. ప్రీ డయాబెటిస్, టైప్-1 డయాబెటిస్, టైప్-2 డయాబెటిస్, హార్మోన్ సమస్యలు, వాటి చికిత్సల గురించి నిపుణుల ప్రసంగాలు విశ్లేషణాత్మకంగా సాగాయి. ప్రీ డయాబెటిక్ దశలోనే సమస్యను గుర్తించి అడ్డుకోవడం, మధుమేహ వ్యాధిని తిప్పికొట్టడం, టైప్-1 డయాబెటిస్ నియంత్రణకు అందుబాటులోకి వచ్చిన ఆధునిక ఔషధాలు, మధుమేహ నియంత్రణలో శరీర బరువు నియంత్రణ యొక్క పాత్ర తదితర అంశాలపై సదస్సులో కూలంకుషంగా చర్చ జరిగింది. సంబంధిత అంశాలపై ప్రతినిధులు అడిగిన సందేహాలకు వైద్య ప్రముఖులు వివరణాత్మకంగా సమాధానాలిచ్చారు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ రెండు సీఎంఈ క్రెడిట్ పాయింట్లను కేటాయించింది. యలమంచి డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ డయాబ్ ఎండో కాన్ 2024లో ప్రముఖ ఎండోక్రైనాజిస్ట్ డాక్టర్ కృష్ణ శేషాద్రికి గోల్డ్ మెడల్ ప్రదానం చేసి, ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైడీఆర్ఎఫ్ ట్రస్టీ డాక్టర్ హిమన యలమంచి, సెక్రటరీ డాక్టర్ ఐశ్వర్య యలమంచి, జాయింట్ సెక్రటరీ డాక్టర్ అమూల్య యలమంచి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News