-త్వరలోనే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, తల్లికి వందనం అమలు
-పవర్మెక్ ఫౌండేషన్ ద్వారా వంద మందికి ఉచితంగా కుట్టుమిషన్లు అందచేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయాన్ని అందించిన మహిళలకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు.
తూర్పు నియోజకవర్గ పరిధిలోని గురునానక్ కాలనీ రోడ్డులో ఎన్.ఎ.సి. కళ్యాణ మండపంలో పవర్ మెక్ ఫౌండేషన్ సజ్జా కిషోర్ బాబు, సజ్జా లక్ష్మి ఆధ్వర్యంలో వంద మంది మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ హజరై మహిళలకు కుట్టు మిషన్లను ఉచితంగా అందచేశారు. కార్యక్రమానికి వేముల దుర్గారావు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మహిళలు ఘనంగా విజయాన్ని అందించారని చెప్పారు. మహిళల సంక్షేమం, యువతకు ఉద్యోగాలు, కార్మికులకు పని కల్పించాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని చెప్పారు. ఇసుకను ఉచితంగా ఇవ్వాలని, నాణ్యమైన కరెంట్ను ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. అన్న క్యాంటీన్ల దగ్గర ప్రతి రోజూ పెళ్ళి మాదిరిగా భోజనాలు చేస్తున్నారని చెప్పారు. నరేంద్రమోడి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సంయుక్తంగా కలిసి ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలెండర్ పథకాన్ని దీపావళికి ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఏడాదికి మూడు గ్యాస్ సిలెండర్లను ఉచితంగా అందచేస్తామని చెప్పారు. త్వరలోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. అమ్మకు వందనం కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తామన్నారు. 2014–19 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు మహిళలకు అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రతి మహిళకు టైలరింగ్లో ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉచితంగానే కుట్టుమిషన్లు అందచేశామని, త్వరలోనే మళ్ళీ ప్రభుత్వ పరంగానే టైలరింగ్లో శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు అందచేస్తామని చెప్పారు. ఇప్పుడు నియోజకవర్గ పరిధిలోని వారికి పవర్మెక్ సంస్థ ద్వారా కుట్టు మిషన్లు అందిస్తున్నామని చెప్పారు. గతంలో విజయవాడ నగరంలో వచ్చిన వరదల సమయంలో కూడా పవర్మెక్ ఫౌండేషన్ వారు సహాయ కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు. నియోజకవర్గంలోని ప్రజలకు ఏ సమస్య వచ్చినా వెంటనే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానమని చెప్పారు.
పల్లెటూరిలో పుట్టి.. వేల మందికి అండగా ఉన్న సజ్జా కిషోర్బాబు: శీరీష
పవర్మెక్ ఫౌండేషన్ సంస్థ తరపున శీరీష మాట్లాడుతూ వపర్మెక్ సంస్థ అధినేత కిషోర్ బాబు పల్లెటూరిలో పుట్టినా ఇప్పుడు వేల మందికి ఉద్యోగాలు కల్పించారని చెప్పారు. విద్య, వైద్య అవసరాల కోసం ఫౌండేషన్తో పాటుగా తన సొంతంగా కూడా అనేక మందికి సహాయం చేస్తున్నారని చెప్పారు. తన దగ్గరకు వచ్చిన వారికి లేదు అనకుండా సహాయం చేస్తారని చెప్పారు. ఫౌండేషన్ ద్వారా సహయం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు.
మహిళల పక్షపాతి తెలుగుదేశం పార్టీ: గద్దె అనురాధ
కృష్ణాజిల్లా జిల్లా పరిషత్ మాజీ ఛైర్పర్సన్ గద్దె అనురాధ మాట్లాడుతూ పవర్మెక్ సంస్థ అధినేత సజ్జా కిషోర్బాబు, సజ్జా లక్ష్మిలకు కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబంలోని ఒక వ్యక్తి వల్ల ఆ కుటుంబం మొత్తం నడవడం కష్టమని అందువల్లనే మహిళల పాక్షపాతి అయిన తెలుగుదేశంపార్టీ ఈ విధంగా కుట్టుమిషన్లు ఉచితంగా అందచేస్తున్నారన్నారు. వ్యక్తిగతస్వార్థాన్ని పక్కనపెట్టి కుటుంబాన్ని నడిపేది మహిళ అని అన్నారు. అందువల్లనే తెలుగుదేశం పార్టీ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కుట్టుమిషన్ల ద్వారా ఆదాయం సంపాదించుకుని కుటుంబానికి అండగా ఉండాలన్నారు. కుట్టుమిషన్లను విక్రయించకుండా ఆదాయ వనరుగా మలచుకోవాలని చెప్పారు. ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ఎన్నో వేల మందికి కుట్టుమిషన్లు, ఇస్త్రీపెట్టెలు, బడ్డీకొట్లు ఇలా వారి జీవనోపాధికి అవసరమైన పరికరాలను ఉచితంగా అందచేశారని చెప్పారు.
ఒక రోజు ముందుగానే మహిళలకు దీపావళి
యువ నాయకులు గద్దె క్రాంతికుమార్, కార్పోరేటర్లు దేవినేని అపర్ణ, చెన్నుపాటి ఉషారాణి, పార్టీ నాయకులు చెన్నుపాటి గాంధీ, నందిపాటి దేవానంద్ మాట్లాడుతూ పండుగ ముందు రోజు ఈ విధంగా ఉచితంగా కుట్టుమిషన్లు ఇవ్వడం వల్ల ఒకరోజు ముందుగానే దీపావళి పండగ వచ్చినట్లు అయ్యిందన్నారు. మహళల ఉన్నతికి కోరుకునే చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే గద్దె రామమోహన్కు మహిళల మనోగతం తెలుసునని అందువల్లనే మహిళలకు అండగా ఉండే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు.
ఈ కార్యక్రమములో పవర్ మెక్ సభ్యులు వాసిరెడ్డి శ్రీనివాసరావు, తుర్లపాటి జవహర్ లాల్ నెహ్రూ, కండగండి సురేష్, సాయిలక్ష్మి, మరియు తెలుగుదేశం నాయకులు తాడి బాబూరావు, దోమకొండ రవి, బండి కోమలి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News