-సాధికారత దిశగా ఆమె వేసే అడుగుకు సమష్టి కృషితో చేయూతనిద్దాం.
-బాలికా సంఘాల ఏర్పాటు, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ.
-జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు కార్యక్రమాల నిర్వహణ.
-జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కిశోరి వికాసం-2 కార్యక్రమం బాలికల బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తుందని.. ఉజ్వలమైన, ఆరోగ్యకరమైన, సాధికారత దిశగా ఆమె వేసే అడుగుకు సమష్టి కృషితో చేయూతనిద్దామని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా అన్నారు.
బుధవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కిశోరి వికాసం-2 కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కిశోరి వికాసం పోస్టర్లను ఆవిష్కరించి, ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా మాట్లాడుతూ కిశోరి వికాసం పునఃప్రారంభం రాష్ట్రంలోని ప్రతి బాలిక భవిష్యత్తును మెరుగుపరచడానికి ఓ మంచి అవకాశమని పేర్కొన్నారు. ప్రతి బాలిక తన పూర్తి సామర్థ్యాన్ని తెలుసుకోగలిగేలా.. సమగ్రాభివృద్ధిని సొంతం చేసుకునేలా ఈ కార్యక్రమం ద్వారా చేయూతనివ్వనున్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవోల సమన్వయంతో కార్యక్రమం పునఃప్రారంభమైందని.. 11-18 ఏళ్ల బాలికలకు విద్య, ఆరోగ్యం, భద్రత, ఆర్థిక స్వావలంబను మెరుగుపరచడం ఈ కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. ఇందుకు ప్రతి గ్రామంలో బాలికల సంఘాలను ఏర్పాటుచేసి.. అవగాహన కల్పించడంతో పాటు, సమస్యల పరిష్కారానికి కృషిచేయనున్నట్లు తెలిపారు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. బాలికల్లో ధైర్యాన్ని పెంపొందించే ఆత్మరక్షణ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం, డిజిటల్ భద్రత, సైబర్ క్రైమ్, ఆన్లైన్ వేదికలపై జాగ్రత్తగా ఉండేలా అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు సజావుగా జరిగేలా, మంచి ఫలితాలు వచ్చేలా కృషిచేయాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ నిధి మీనా సూచించారు.
సరైన విజ్ఞానం అందించాలి: డీఎల్ఎస్ఏ సెక్రటరీ రామకృష్ణ
జిల్లా న్యాయ సేవల అథారిటీ (డీఎల్ఎస్ఏ) సెక్రటరీ రామకృష్ణ మాట్లాడుతూ కిశోరి బాలికలకు సరైన విజ్ఞానం అందించి.. జీవితంలో అన్ని విధాలా ఎదిగేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలు.. ప్రపంచానికి సవాళ్లుగా నిలుస్తున్నాయని.. వీటిని అరికట్టేందుకు సరైన అవగాహనతో సమష్టి కృషి అవసరమన్నారు. బాలికలు అన్ని విధాలా ఎదగడానికి ఉన్న అడ్డంకులను తొలగించడంలో పటిష్ట భాగస్వామ్యం ఉండాలన్నారు. బాల్య వివాహ నిషేధ చట్టం-2006, బాలల లైంగిక దాడి నుంచి రక్షణ చట్టం (పోక్సో) -2012 తదితరాలపై అవగాహన కల్పించారు.
డ్రాప్ అవుట్స్ తిరిగి చదువుకునేలా ప్రోత్సహించడం, నైపుణ్యాభివృద్ధి, వృత్తి విద్య, ఉపాధి అవకాశాలు పెంచడం, రక్తహీనతను నివారించడం, బాల్య వివాహాలను అడ్డుకోవడం, యోగా, శారీరక వ్యాయామాన్ని ప్రోత్సహించడం తదితరాలపై జిల్లా మహిళా, శిశు అభివృద్ధి అధికారి జి.ఉమాదేవి వివవరించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, ఇంటర్మీడియెట్ విద్య అధికారి సి.శివ సత్యనారాయణరెడ్డి, మార్పు ట్రస్ట్ ఆర్.సూయజ్, స్కిల్ డెవలప్మెంట్ జెడ్డీఎం సుమలత, యోగా ట్రైనర్ శిరీష, డిప్యూటీ డీఎంహెచ్వో డా. ఇందుమతి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News