విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మలేరియా నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ యస్. ఢిల్లీ రావు అధికారులకు పిలుపునిచ్చారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం మలేరియా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించే పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్ కుమార్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు మలేరియాపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. మలేరియా వ్యాధి ప్లాస్మోడియం పారసైట్ అనే పరాన్న జీవి ద్వారా సంభవిస్తుందన్నారు. దోమ కాటు వలనే మలేరియా వ్యాధి బారిన పడతారన్నారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలన్నారు. ఎక్కడా నీరు నిలువ లేకుండా చూడాలని ఆయన పేర్కొన్నారు . మంచి నీటిలో లార్వా పెరుగుదల ఉంటుందని ఆయన పేర్కొంటూ శుక్ర వారం డ్రై డేను పాటించాలని సూచించారు. ఖాళీ టైర్లు, సీసాలు, కొబ్బరి బొండాలు తదితర పరికరాల్లో నీటి నిల్వ ఉండి దోమలు పెరుగుదలకు దోహదం చేస్తాయని వాటిని ఎప్పటికప్పుడు తొలగించాలని దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. దోమల ద్వారా మలేరియా వ్యాప్తి చెందుతుందని లార్వా దశలోనే దోమలను నిర్మూలించేందుకు యాంటీ లార్వా ఆపరేషన్ నిర్వహించటం ధ్వారా వాటి వ్యాప్తిని అరికట్టవచ్చునని కలెక్టర్ అన్నారు. దోమ తెరలు వినియోగించడం ద్వారా దోమ కాటుకు గురయ్యే అవకాశం ఉండదని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో, ముఖ్యంగా నగరపాలక సంస్థ పరిధిలో విస్తృతంగా మలేరియా స్ప్రేయింగ్ సక్రమంగా చేసేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను కోరారు. మురుగునీటి కాలువలలో మురుగునీటి పారుదల సక్రమంగా జరగాలని, అడ్డంకి లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. నీరు నిల్వ ఉన్న చోట్ల ఎబేట్, ఆయిల్ బాల్స్ వేయడం ద్వారా దోమలను నిర్మూలించవచ్చునని అన్నారు. వర్షాకాలంలో మరింత జాగ్రత్తలు పాటించాలని ఆయన తెలిపారు. మలేరియా నివారణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని కలెక్టర్ ఢిల్లీరావు పేర్కొన్నారు.
పోస్టర్ విడుదల కార్యక్రమంలో డిఆర్ఓ కె. మోహన్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. ఎం. సుహాసిని, జిల్లా మలేరియా అధికారి డా. మోతీబాబు, బయాలజిస్ట్ సూర్యకుమార్, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News