తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి నగరంలోని ప్రముఖ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్ర అసెంబ్లీ వంటి అత్యున్నత ప్రజాస్వామ్య వేదికలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్ర చిత్రాలను రాజకీయ ప్రయోజనాల కోసం ప్రదర్శించడం తీవ్రంగా ఖండనీయమని పేర్కొన్నారు. అసెంబ్లీ అనేది ప్రజల ఆశయాలను ప్రతిబింబించే గౌరవనీయమైన వేదిక అని, అలాంటి చోట దైవ చిత్రాలను ప్రదర్శిస్తూ రాజకీయ ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన అన్నారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక అయిన స్వామివారి చిత్రాలను రాజకీయ వాదోపవాదాలకు ఉపయోగించడం అనేది భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యగా అభివర్ణించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికీ అభిప్రాయ స్వేచ్ఛ ఉన్నప్పటికీ, ఆ స్వేచ్ఛను వినియోగించే సమయంలో సంస్కారం, పరిమితులు పాటించడం అవసరమని హితవు పలికారు. అసెంబ్లీ గౌరవాన్ని కాపాడడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన మార్గదర్శకాలు రూపొందించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు మరియు మాజీ మంత్రి పానబాక లక్ష్మి, బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సమంచి శ్రీనివాసులు, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, గ్రీనరీ మరియు బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ, జనసేన పార్టీ టౌన్ అధ్యక్షులు రాజా రెడ్డి, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News