Breaking News

ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధనాలపై పోరాడండి… : ఎమ్మెల్యే గద్దె రామమోహన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైకాపా ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పార్టీ శ్రేణులు పోరాడాలని శాసనసభ్యులు గద్దె రామమోహన్ పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం అశోక్ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 15, 16 డివిజన్ల తెలుగుదేశం పార్టీ శ్రేణులతో శాసనసభ్యులు గద్దె రామమోహన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గద్దె రామమోహన్ మాట్లాడుతూ వైకాపా పార్టీ నాయకులు తమ ప్రభుత్వంపై వస్తున్న ప్రజావ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వీటిని ప్రజలకు వివరించి చైతన్య వంతులను చేయాలన్నారు. ఆస్తిపన్ను, యూజర్ ఛార్జీలు పెరుగుతున్నాయని, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయని, గత ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు రద్దు చేశారని, అన్నా క్యాంటీన్లు లేవు, చంద్రన్న బీమా, పెళ్ళి కానుకలు, పండుగ కానుకలు, బి.సి, ఎస్సీ, ఎస్టీ, కాపు కార్పొరేషన్ లోన్లు , విదేశీ విద్య తీసివేశారని, కేవలం నవరత్నాల పేరుతో కొంతమందికి మాత్రమే సహాయాలు అందించి, వాటి ప్రచారాలకు మాత్రం పెద్ద ఎత్తున ఖర్చుచేస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి 14వ డివిజన్ ను ( 15, 16 డివిజన్లను ) ఎంతో అభివృద్ధి చేశామని, కరకట్ట వెంబడి వరద ముంపు బాధితుల కోసం రక్షణగోడ నిర్మిణం చేశామని, రిటైనింగ్ వాటి నిర్మాణ సమయంలో ఆ ప్రాంతంలోని డ్రైనేజీ నీరు బయటకు పోయేందుకు రక్షణగోడకు తూములు ఏర్పాటు చేశామని, తూములు ఏర్పాటు చేసిన చోట వరద నీరు రాకుండా ఇసుక బస్తాలు వేయించామని గద్దె రామమోహన్ తెలిపారు. కానీ వైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఇసుక కొరత వచ్చిన సందర్భంగా కొందరు ఆ ఇసుక బస్తాలను తీసివేశారని, తరువాత వచ్చిన వరదలలో రక్షణగోడ వెంబడి కొంత మేర నీరు వచ్చిందని, కానీ నాసిరకంగా కట్టారని వైకాపా నాయకులు చెబుతున్నారని ఇది వారి అజ్ఞానాన్ని తెలియజేస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న గత 5 సంవత్సరాలలో రామలింగేశ్వర నగర్ లో రూ.15 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని, ఎవరైనా అడిగితే చేసిన పనులు చూపించండి అని గద్దె రామమోహన్ తెలిపారు. రామలింగేశ్వర నగర్ సాయిరామ్ కటి పీనెస్ రోడ్డులో 6 రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేయడం అసాధ్యమన్నారని, కానీ వాటికి నిధులు కేటాయించి సుసాధ్యం చేయించి చూపామని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నుంచి నిధులు కేటాయించి ఆ ప్రాంతంలో వివాహ కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు చేసుకునేందుకు కమ్యూనిటీ హాలు నిర్మించామని, దాన్ని వైకాపా ప్రభుత్వం సచివాలయంగా మార్చి ఎస్సీ, ఎస్టీలు చిన్నపాటి కార్యక్రమాలు చేసుకునేందుకు వీలులేకుండా చేసిందని, కమ్యూనిటీ హాలు ఎస్సీ, ఎస్టీలు కార్యక్రమాలు చేసుకునేందుకే వాడుకునేలా, సచివాలయాన్ని మరోచోటకు మార్చుకోనేలా కోర్టుద్వారా పోరాటం చేసి తద్వారా కమ్యూనిటీ హాలు పేదల అవసరాలకే వాడుకోవాలనే తీర్పు వచ్చిన సంగతి గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ హాయాంలో కట్టిన రిటైనింగ్ వాల్ కోసం ఒక్క ఇంటిని కూడా తీయలేదని, ఇప్పుడు వందలాది ఇళ్ళు తొలగిస్తున్నారని ఇళ్ళు తీసివేస్తే రిటైనింగ్ వాల్ ఎవరికోసమని గద్దె ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తామంతా గత ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమ పథకాలకు తోడు నవరత్నాలు అమలు చేస్తారని అనుకున్నామని, కానీ కేవలం నవరత్నాలకే పరిమితమయ్యారని, చంద్రన్న భీమా కొనసాగి ఉంటే కరోనాతో చనిపోయిన వారందరికీ రూ.2 లక్షల భీమా వచ్చిఉండేదని వీటన్నింటిని పార్టీ శ్రేణులంతా ప్రజలకు వివరించి చైతన్యపరచాలని గద్దె రామమోహన్ పార్టీ శ్రేణులను కోరారు. దానికి అనుగుణంగా పటిష్టమైన డివిజన్ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని గద్దె రామమోహన్ వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 15, 16 డివిజన్ల కో – ఆర్డినేటర్ రత్నం రమేష్, చెన్నుపాటి గాంధీ, చిన్నం ఈశ్వరరావు, చెరుకూరి మురళీకృష్ణ, తోట ప్రసాద్, పున్నవల్లి రాధాకృష్ణ, పగిడిపాటి రమణారెడ్డి, తిప్పాడ నాగేశ్వరరావు, సింగంశెట్టి రమేష్, ఉప్పుశెట్టి లీలా వెంకట్రావు, నందమూరి పూర్ణచంద్రరావు, పసుపులేటి రవీంద్రబాబు, కేతినేని శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

Check Also

అమరావతికి కొత్తరైల్వే లైన్‌ మంజూరును స్వాగతిస్తున్నాం

-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతికి కొత్త రైల్వే లైన్‌ మంజూరు చేస్తూ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *