-అలాంటి వ్యక్తికి ఇతరుల్ని నిందించే హక్కు లేదు
-రాజకీయాల్లో కూడా జగన్ విఫల విద్యార్థి అని నిరూపించుకుంటున్నారు
-గతాన్ని మరచిపోయే వ్యక్తికి రాజకీయాల్లో భవిష్యత్తు ఉండదు
-అధికారం లేకపోవడంతో జగన్ భ్రమల్లో బతుకుతున్నారు
-జగన్ ప్రెస్ మీట్పై ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పదునైన కౌంటర్
-సిఎం చంద్రబాబు సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా నడిపించే దార్శనికతకు బ్రాండ్ అంబాసిడర్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మరే ఇతర రాజకీయ నాయకుడికి సాధ్యం కాని ‘విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్’ అనే ఘనతను సంపాదించారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నేడొక ప్రకటనలో ధ్వజమెత్తారు.
గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అన్ని విధాలా పూర్తిగా నాశనం చేశారని మండిపడ్డారు. అధికారాన్ని కోల్పోవడంతో పార్టీని వీడుతున్న నాయకుల్ని, కార్యకర్తల్ని నిలబెట్టుకోవడానికి మళ్లీ అధికారంలోకొస్తాననే భ్రమలు కల్పించడానికి విఫల ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తిరిగి అధికారంలోకి వస్తాననే కలలుకంటున్న భ్రమల బాధితుడు జగన్ అని ఆరోగ్య మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ అభివర్ణించారు. చంద్రబాబు గత పాలనపైనా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం 8 నెలల ప్రభుత్వ పనితీరుపై జగన్ చేసిన ఆరోపణలను మంత్రి బలంగా తిప్పికొట్టారు. చంద్రబాబు పాలనా తీరు, తన పాలనా తీరు పై తాను ఈరోజు ప్రెస్ మీట్లో వివరణ ఇచ్చాక , భవిష్యత్తులో చంద్రబాబుకు ఎవరూ ఓటేయరన్న జగన్ వ్యాఖ్యలపై మంత్రి తీవ్రంగా స్పందించారు.
జగన్ రెడ్డి ప్రెస్ మీట్ గురించి ప్రస్తావించిన సత్యకుమార్ యాదవ్… వైఎస్ జగన్ తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేశానన్న విషయాన్ని పూర్తిగా విస్మరించారని, గతం మరిచిన రాజకీయ నాయకులకు భవిష్యత్తు ఉండదని స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాజకీయాల్లో కూడా ఒక విఫల విద్యార్థి అని అభివర్ణించారు. స్కూల్, కాలేజీల్లో చదివే రోజుల్లో ఆయన బ్యాడ్ స్టూడెంట్గా ఉన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమం, అభివృద్ధి రంగాలలో తన పాలనను పదేపదే సమర్థించుకోవడానికి జగన్ రెడ్డి ప్రయత్నించారని, కానీ గత సంవత్సరం ఎన్నికల్లో ప్రజలు అతన్ని పూర్తిగా తిరస్కరించి నిజం ఏమిటో నిరూపించారని మంత్రి అన్నారు. తదుపరి ఎన్నికల్లో ప్రజలు తనను ఆదరిస్తారని జగన్ రెడ్డి నమ్మడం అంటే పగటి కలలు కనడమేనని అన్నారు.
జగన్ రెడ్డిలా కాకుండా, ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా నడిపించే దార్శనికతకు బ్రాండ్ అంబాసిడర్లా ప్రసిద్ధి చెందారని సత్యకుమార్ యాదవ్ చెప్పారు. రాజ్యాంగ విలువలు, కృషి, యువతకు అవకాశాలు సృష్టించే నిజమైన స్ఫూర్తితో చంద్రబాబు ముందుకు వెళ్తున్నారన్నారు. ప్రజాస్వామ్యం పట్ల చంద్రబాబుకు ఉన్న నిబద్ధత గురించి కూడా మంత్రి గుర్తు చేశారు.
మాజీ ముఖ్యమంత్రి ఐదేళ్ల విధ్వంసం తర్వాత, రాష్ట్రం అప్పుడు కోల్పోయిన విలువైన సమయాన్ని, అవకాశాలను తిరిగి అందిపుచ్చుకునేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆరోగ్య మంత్రి సత్య కుమార్ యాదవ్ వివరించారు. ఇప్పటి వరకు రాష్ట్రం ఆకర్షించిన రూ.6 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు, రాజధాని అమరావతి ప్రాంతంలో త్వరితగతి అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, పోలవరం నిర్మాణాన్ని వేగవంతం చేయడం, 20 లక్షల ఉద్యోగాల సృష్టికి నిర్దిష్ట ప్రణాళికలు, మౌలిక సదుపాయాల మెరుగుదల మొదలైన అంశాలను మంత్రి ప్రస్తావించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ పూర్తి మద్దతుతో, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ‘బ్రాండ్ ఆంధ్రప్రదేశ్’ పందిరి కింద రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని శ్రీ సత్యకుమార్ యాదవ్ వివరించారు.
అత్యంత కీలకమైన ప్రజారోగ్యాన్ని కూడా జగన్ తీవ్రంగా విస్మరించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాన్ని ఆర్భాటంగా ప్రకటించారు గానీ, ఆ ఐదేళ్లలో సాధించిన పురోగతి అత్యంత ఘోరంగా ఉందన్నారు. ఆరోగ్య రంగంలో ‘నాడు-నేడు’ కింద చేపట్టిన పనుల విషయంలో కూడా ఇదే జరిగిందని గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఐదేళ్ల పాలనలో చెప్పిన మాటలకు, చేతలకు మధ్య పొంతనే లేదని మంత్రి స్పష్టం చేశారు. ఏ ఒక్క హామీ విషయంలోనూ చెప్పినట్టు నడుచుకున్న సందర్భం ఒక్కటి కూడా లేదని విమర్శించారు. జగన్ ప్రకటించిన ఏ హామీ కూడా నెరవేరలేదు కాబట్టి, నవరత్నాలన్నీ రాళ్లుగానే మిగిలిపోయాయన్నారు. సత్యకుమార్ యాదవ్ వ్యంగంగా స్పందించారు. అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనా తీరును విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
Prajavartha Online Telugu News