-పట్టువస్త్రాలను సమర్పించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్
-స్వామివారిని దర్శించుకొని పూజలు చేసిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
నెల్లిమర్ల, (విజయనగరం), నేటి పత్రిక ప్రజావార్త :
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీరామస్వామి వారి దేవస్థానంలో ఆదర్శ దంపతులు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. వందలాదిమంది భక్తులు జేజేలు పలుకుతుండగా శ్రీరామచంద్రుడు సీతమ్మవారి మెడలో మాంగల్య ధారణ చేశారు. ముత్యాల తలంబ్రాలు పోశారు. ఈ అపూర్వ దృశ్యాలను చూసి భక్తులు పరవశించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సతీసమేతంగా అధికార లాంఛనాలతో శ్రీ సీతారాములకు పట్టువస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. సంప్రదాయానుసారం ఆలయ అనువంశిక ధర్మకర్త, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు, ఆయన తనయ, విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు తో కలిసి స్వామివారికి మధు పర్కాలు సమర్పించారు. ఎప్పటిలాగే సింహాచలం వరాహ లక్ష్మీ నృసింహస్వామి క్షేత్రం నుంచి పట్టు వస్త్రాలను, మంత్రి శ్రీనివాస్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు దంపతుల చేతుల మీదుగా, సింహాచలం ఈవో సుబ్బారావు అందజేశారు. మంత్రి కొండపల్లి, ఎంపీ కలిశెట్టి దంపతులు కళ్యాణ మండపంలో కూర్చొని పరిణయ వేడుకను కనులారా తిలకించారు.
అంతకుముందు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి దంపతులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మెన్ డాక్టర్ డివిజి శంకరరావు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, ఆయన సతీమణి, మాజీ ఎంపీ ఝాన్సీ లక్ష్మి, ఎమ్మెల్సీ డాక్టర్ సురేష్ బాబు, దేవాదాయ శాఖ డీసీ సుజాత, ఏసి శిరీష, ఆర్డీవో డి.కీర్తి, రామతీర్థం ఆలయ ఈవో వై.శ్రీనివాస్, తహసీల్దార్ సుదర్శన్, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఆలయ ప్రధానార్చకులు సాయి రామచార్యులు, కిరణకుమార్ ఆధ్వర్యంలో వివాహ ఉత్సవాన్ని హయగ్రీవాచార్యులు తదితర వేద పండితులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.
Prajavartha Online Telugu News