-ప్రజల్లోకి వెళ్లి వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి
-జగన్ ప్రభుత్వ నిర్వాహకంతోనే విద్యుత్ భారాలు
-ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
పల్నాడు, నేటి పత్రిక ప్రజావార్త :
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో హోం మంత్రి వంగలపూడి అనితతో కలిసి శుక్రవారం నాడు మంత్రి గొట్టిపాటి పర్యటించారు. ఈ సందర్భంగా రూ. 1.5 కోట్లతో నిర్మించిన జలాల్పురం – పరస రోడ్డును స్థానిక శాసన సభ్యులు భాష్యం ప్రవీణ్ తో కలిసి మంత్రులు ప్రారంభించారు. అనంతరం రూ.1.75 కోట్లతో నిర్మించనున్న ఉంగుటూరు – కంభంపాడు రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సుపరిపాలనలో – తొలి అడుగు, ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాల అమల తీరును లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా క్షేమం కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం ప్రారంభించిన ప్రతీ పథకం కూడా అర్హులకు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి గొట్టిపాటి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే ఇచ్చిన మాట ప్రకారం దేశంలో ఎక్కడాలేని విధంగా 64 లక్షల మంది లబ్ధిదారులకు ఏడాదికి రూ.33,000 కోట్లతో పెన్షన్ అందిస్తున్నామన్నారు. ఎన్నికల హామీల్లో చెప్పిన విధంగా ఎంత మంది పిల్లులు ఉంటే అంతమందికి తల్లికి వందనం అమలు చేసినట్లు పేర్కొన్నారు. ఒకే రోజు రూ.10,000 కోట్లు తల్లుల ఖాతాల్లో జమ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు. వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు. ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్ ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అమ్మ ఒడి ద్వారా ఇద్దరు పిల్లలకు నగదు సహాయం చేస్తానని మాటిచ్చిన జగన్మోహన్ రెడ్డి., ఒక్కరికే అమ్మ ఒడి వేసి రాష్ట్రంలోని పిల్లల తల్లులందరినీ మోసం చేశాడని మంత్రి గొట్టిపాటి విమర్శించారు. కుటుంబ సాధికార సారథులు (కేఎస్ఎస్) ప్రతి ఇంటికీ వెళ్లి పథకాల అమలు తీరును ప్రజలకు వివరించి, వైసీపీ నేతల దుష్ప్రచారాన్నితిప్పి కొట్టాలని కోరారు. సంక్షేమ పథకాల అమలులో ఏవైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి లబ్ధి జరిగేలా చూడాలని కేఎస్ఎస్ లకు సూచించారు.
హింసా రాజకీయాలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ దూరంగానే ఉంటుందని మంత్రి గొట్టిపాటి వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు హింసను ప్రేరేపించే విధంగా మాట్లాడడం తగదని అన్నారు. పల్నాడులో సొంత కార్యకర్తను కారుతో తొక్కించి ఆస్పత్రిలో చేర్చకుండా పక్కన పడేసి వెళ్లిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది అన్నారు. ఇటువంటి చర్యతో వైసీపీ కార్యకర్తల పట్ల, ప్రజల పట్ల జగన్ బాధ్యత ఏంటో అందరికీ అర్థమవుతుందని మంత్రి గొట్టిపాటి ఎద్దేవా చేశారు. ఇకనైనా వైసీపీ నేతలు రెచ్చగొట్టే చౌకబారు మాటలు మానుకోవాలని హితవు పలికారు. వైసీపీ నేతలు తమ పంథా మార్చుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.
కూటమి ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదు…
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే సుమారు 75 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఒక్కో వ్యవసాయ కనెక్షన్ కు ట్రాన్స్ ఫార్మర్, స్థంబాలతో కలిపి ప్రభుత్వానికి రూ.2.40 లక్షల వ్యయం అవుతుందని, దీనితో పాటు జీవితకాలం అన్నదాతకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలు, నిర్లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ పథకాలను వెనక్కి తిప్పి పంపడం వల్లే ప్రస్తుతం… రాష్ట్ర ప్రజలు విద్యుత్ భారం మోయాల్సివస్తుందని ఆరోపించారు. ప్రజలందరికీ 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు రైతులకు పగటి పూటే 9 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయడానికి కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News