-బాల్యవివాహాలు నివారణకు అధికారుల బాధ్యత ఎంతో కీలకం – ప్రజల్లో అవగాహన పెంపుదలపై దృష్టి
-ప్రపంచ మానవ అక్రమ రవాణా దినోత్సవం సందర్భంగా పోస్టర్ ఆవిష్కరణ
– జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
చైల్డ్ వెల్ఫేర్, విద్య, పోలీస్ తదితర శాఖల అధికారు లతో బుధవారం జిల్లా కోర్టు ఆవరణలోని సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ 1987లో ఏర్పడినప్పటి నుండి పలు ప్రజాపయోగి పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోందని తెలిపారు. ముఖ్యంగా 2015 నుంచి మానవ అక్రమ రవాణా, బాల కార్మికుల వాడకం, బాల్యవివాహాలు, లైంగిక వేధింపులు, కిడ్నాప్ తదితర చట్టవ్యతిరేక చర్యలపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నా మని స్పష్టం చేశారు. గౌరవ సుప్రీంకోర్టు మరియు జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ సూచనల మేరకు ప్రజల్లో చట్టాలపై అవగాహన కల్పించేందుకు లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోందని ఆమె వివరించారు. ఎప్పటికప్పుడు అధికారుల్లో , ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు,అవగాహన సదస్సులు, పబ్లిసిటీ మెటీరియల్స్, సామూహిక శిక్షణల ద్వారా సమాచారం అందించబడుతోందని ఆమె తెలిపారు. ప్రజలు ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సమస్య ఎదురైనప్పుడు నిర్భయంగా అధికారులను సంప్రదించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పోలీస్, విద్య, బాలల సంక్షేమ శాఖల అధికారులు తమ విధులు నిర్వర్తించడమే కాకుండా సమాజంలో జరుగుతున్న చట్టవ్యతిరేక చర్యలపై కూడా స్పందించి ప్రజలకు సరైన దిశా నిర్దేశనం చెయ్యాలని కోరారు. తాజాగా కొన్ని గ్రామాలలో బాల్య వివాహాల సమాచారం తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొని, పంచాయతీ కార్యదర్శులు ఇటువంటి ఘటనలపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని వివరించారు. అంతే గాక, మౌలిక సదుపాయాలు లేని గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి ఘటనలు వెలుగులోకి వచ్చిన వెంటనే సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఆలస్యమైతే బాధితులను రక్షించడం కష్టతరమవుతుందని హెచ్చరించారు.
మానవత్వాన్ని కాపాడే మార్గంలో – మానవ అక్రమ రవాణా నివారణ పోస్టర్ ఆవిష్కరణ
మానవ హక్కులను పరిగణనలోకి తీసుకొని, మానవ అక్రమ రవాణా వంటి చట్టవ్యతిరేక, క్రూరమైన కార్యకలాపాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. మానవ అక్రమ రవాణా భయానక ఫలితాలను ప్రజల ముందు ఉంచి, బాధితులకు సహాయం అందించడానికి, సమాజాన్ని ఈ ముప్పు నుండి కాపాడేందుకు ఈ పోస్టర్ కీలకమైన అవగాహన సాధనంగా నిలుస్తుంది. ప్రతి ఒక్కరు మానవ రవాణా నిరోధానికి బాధ్యతగా స్పందించాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఎన్. శ్రీ లక్ష్మీ , ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి, రాజమహేంద్రవరం రెడ్డి ప్రసన్న , జిల్లా పాఠశాల విద్యాధికారి కె వాసుదేవరావు, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి సిహెచ్. లక్ష్మి , ఇతర శాఖల అధికారులు, పోలీసు అధికారులు,న్యాయ వాదులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News