– 24/7 అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలి
– రక్షణ, భద్రతా ఏర్పాట్లలో ఎక్కడా రాజీపడేది లేదు
– హెచ్చరిక బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వర్షాలతో పాటు పైనుంచి కృష్ణాకు వరద నీరు పోటెత్తే అవకాశం ఉండటంతో ప్రకాశం బ్యారేజీకి ఎగువ, దిగువ ప్రాంతాల్లో 24/7 అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని.. ప్రజలను కూడా అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు. మంగళవారం రాత్రి కలెక్టర్ లక్ష్మీశ.. ఆర్డీవోలతో పాటు ఇరిగేషన్, రెవెన్యూ, వీఎంసీ తదితర విభాగాల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వచ్చే రెండుమూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలతో పాటు ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తి క్రమేణా 4-5 లక్షల క్యూసెక్కులకు కూడా చేరుకునే అవకాశం ఉన్నందున, ముందు జాగ్రత్తగా నదీ పరిసర ప్రాంత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. నదివైపు వెళ్లకుండా హెచ్చరికల బోర్డులు కూడా ఏర్పాటు చేయాలని.. ముఖ్యంగా పిల్లల్ని, పశువులను నదివైపు వెళ్లకుండా చూడాలన్నారు. నదిలో చేపల వేటకు వెళ్లకుండా మత్స్యకార గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. వెలగలేరు రెగ్యులేటర్ వద్ద పరిస్థితి నిరంతర పర్యవేక్షణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా నదిలో ఈతకు వెళ్లకుండా, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్థానికంగా అనౌన్స్మెంట్లు చేయించాలని స్పష్టం చేశారు. 91549 70454 నంబరుతో కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ను క్రియాశీలం చేయాలని, అన్ని సౌకర్యాలతో పునరావాస శిబిరాలను కూడా సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు.
Prajavartha Online Telugu News