-టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతికుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్లాస్టిక్ నియంత్రణ కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోందని, అయితే ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కలిగితేనే పూర్తి ఫలితాలు సాధ్యమవుతాయని టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతికుమార్ అన్నారు. ఆదివారం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ వాకర్స్ గ్రౌండ్ వద్ద, ఒకసారి ఉపయోగించే ప్లాస్టిక్ల హానికర ప్రభావాలపై అవగాహన కల్పిస్తూ, పర్యావరణహిత పత్తి సంచుల వినియోగాన్ని ప్రోత్సహించే కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి గద్దె క్రాంతి కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ ప్రతిఒక్కరు కూడా వారి ఇంటి స్థాయి నుంచే ప్లాస్టిక్ నియంత్రణ చేయాలని, ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్, పర్యావరణాన్ని మాత్రమే కాకుండా మానవ ఆరోగ్యాన్నీ తీవ్రంగా ప్రభావితం చేస్తోందన్నారు. కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కూడా ప్లాస్టిక్ వినియోగమే ప్రధాన కారణంగా వైద్య నిపుణులు చెబుతున్నారన్నారు. ప్లాస్టిక్ వాడకం వల్ల నీరు, నేల, గాలి కలుషితం అవుతుందని, భవిష్యత్ తరాల భద్రత కోసం ఇప్పటి నుంచే ప్లాస్టిక్ రహిత ఉద్యమం జరగాలని అది ప్రజల సహకారంతో సాగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇప్పటికే ప్లాస్టిక్ నిషేధంపై చట్టాలు తీసుకువచ్చినా, ప్రజలు సహకరించకపోతే ఫలితాలు రాబోవని స్పష్టం చేశారు. సమాజ మార్పు కోసం ప్రతి ఒక్కరు ముందడుగు వేయాలని, పౌరులు చైతన్యం కలిగి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తేనే రాష్ట్రం పూర్తిగా ప్లాస్టిక్ రహితంగా మారుతుంది అని గద్దె క్రాంతికుమార్ తెలిపారు. సమాజాన్ని చైతన్య పరుస్తూ ఇటువంటి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన పాలిటెక్నిక్ వాకర్ అసోసియేషన్ సభ్యులను ఆయన అభినందించారు. వాకర్ గుత్తికొండ సతీష్ కుమార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా విజయవాడలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించి, పరిశుభ్రమైన మరియు పచ్చని పర్యావరణాన్ని ప్రోత్సహించాలనే సామూహిక సంకల్పాన్ని ప్రతిబింబించేందుకు పత్తి సంచులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ పత్తి సంచులు పోరంకిలోని కాసరనేని కృష్ణ ప్రసాద్ యూనిట్లో తయారు చేయబడుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి కృష్ణా జిల్లా అదనపు ఎస్పీ శ్రీ వి. వెంకటేశ్వర నాయుడు హాజరై, ఈ హరిత కార్యక్రమానికి మద్దతు తెలిపారు.
Prajavartha Online Telugu News