గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని హనుమయ్య విగ్రహం నుండి బృందావన్ గార్డెన్స్, లక్ష్మీపురం మదర్ థెరిస్సా విగ్రహం వరకు బుధవారం నుండి ఇరువైపులా డ్రైన్లపై ర్యాంప్ లు, ఆక్రమణలను తొలగించి, పూడికతీత పనులు చేపట్టాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక, ప్రజారోగ్య అధికారులతో సంయుక్త సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, , అందుకు తొలుత డ్రైన్లను ఓపెన్ చేసి, నూరు శాతం పూడిక తీయాలన్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో డ్రైన్లు ఓవర్ ఫ్లో జరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య విభాగాలు సమన్వయంతో డ్రైన్ల శుభ్రం, ఆక్రమణల తొలగింపు చేపట్టాలని ఆదేశించారు. అలాగే జిన్నా టవర్ నుండి చేపట్టిన డ్రైన్లపై స్లాబ్లు, ఆక్రమణల తొలగింపు, పూడికతీత పనులను మరోవైపు కూడా వేగంగా చేస్తూ వై జంక్షన్ వరకు చేపట్టాలని డిసిపిని ఆదేశించారు. ఇంజినీరింగ్ అధికారులు ఏఈల వారీగా బిల్లులను నిధి పోర్టల్ ల్లో అప్ లోడ్ చేయాలన్నారు. ప్రజారోగ్య అధికారులు డివిజన్ల వారీగా మైక్రో ప్యాకెట్స్ రీ ఫైనల్ చేయడం, వాటికి కేటాయించిన కార్మికులు, ఇళ్లు సంఖ్యలతో కూడిన వివరాలు అందించాలన్నారు. అలాగే డివిజన్లలో పారిశుధ్య పనులు మెరుగ్గా చేపట్టేందుకు అవసరమైన వాహనాలు, సామగ్రి కోసం రిపోర్ట్ ఇవ్వాలన్నారు. ప్రజారోగ్య విభాగంలో కార్మికులను సద్వినియోగం చేసుకోవాలని, కొన్ని డివిజన్లలో మస్టర్ అనంతరం విధుల్లో కార్మికులు ఉండడం లేదని, మధ్యాహ్నం పని చేయడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయని, తమ క్షేత్ర స్థాయి పర్యటనలో గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎస్ఎస్ లకు కేటాయించిన అదనపు ట్రాక్టర్లు, కార్మికులతో చెట్ల కొమ్మలు, భవన నిర్మాణ వ్యర్ధాలను తొలగించాలని ఆదేశించారు.
సమావేశంలో డిప్యూటీ కమిషనర్ టి.వెంకట కృష్ణయ్య, సిటి ప్లానర్ రాంబాబు, ఎస్ఈ (ఇంచార్జి) సుందర్రామిరెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీ నారాయణ, ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక, ప్రజారోగ్య అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News