గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఏసుక్రీస్తు మార్గంలో ఎదుట వానికి సహాయపడడమే నిజమైన భక్తి అని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. శుక్రవారం గుంటూరు నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన సెమి క్రిస్టమస్ వేడుకల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు మహ్మద్ నసీర్, డిప్యూటి మేయర్ షేక్ సజిలా, జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, క్రిస్మస్ వేడుకల ద్వారా ఏసుక్రీస్తు సందేశాన్ని నేటి తరానికి తెలియచేయుట జరుగుతుందన్నారు. నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఏటా సంక్రాంతి వేడుకలు, సెమి క్రిస్మస్ వేడుకలు, ముస్లిం పర్వదినాలైన బక్రీద్, రంజాలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ మత సామరస్యానికి కృషి చేస్తున్నామన్నారు.
కమిషనర్ మాట్లాడుతూ, నగరపాలక సంస్థ తరుపున సంక్రాంతి సంబరాలు, రంజాన్, బక్రీద్ లకు తగిన ఏర్పాట్లు, సెమి క్రిస్టమస్ వేడుకలు జరుపుతున్నామన్నారు. ఏసుక్రీస్తు జీవితం త్యాగాల మయమని ఆయన ప్రజల పాపాల ప్రక్షాళనకు ప్రాణ త్యాగం చేశారన్నారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ విధి నిర్వహణ సమర్దవంతంగా చేపట్టడమే ప్రజలకు సేవ చేయడం అన్నారు.
తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నసీర్ మాట్లాడుతూ ప్రప్రంచంలో అత్యధిక ప్రజలు క్రిస్టమస్ పండుగను జరుపుకుంటారన్నారు. కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలవడమే క్రీస్తు బోధనల సారమన్నారు.
జనసేన జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిఎంసి సెమి క్రిస్టమస్ వేడుకల నిర్వహణ ద్వారా సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తుందన్నారు. సర్వమత సమ్మేళనంగా భారత దేశం ఉంటుందన్నారు.
అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలియచేశారు.
కార్యక్రమంలో ఏఈఎల్సి సంఘం నార్ ప్యారీష్ చర్చి బిషప్ బాబురావు, ఫాదర్లు పురుషోత్తం చౌదరి, సూర్య ప్రకాశరావు, విభాగాధిపతులు, డిప్యూటీ కమిషనర్లు, కార్పొరేటర్లు, పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News