గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల ఆరోగ్యసంరక్షణకు గ్రామాల్లో తరచూ వైద్యశిబిరాలు నిర్వహించాలని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ ప్రభుత్వ వైద్యులను ఆదేశించారు. గన్నవరం నియోజకవర్గం పరిధిలోని ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యులతో మంగళవారం సాయంత్రం సమీక్షా సమావేశం నిర్వహించారు. నిడమానూరులోని టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో యార్లగడ్డ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ వైద్యశాలల్లో అవసరమైన రోగులకు క్రమం తప్పకుండా ఉచితంగా రక్తపరీక్షలు చేయాలని సూచించారు. అంటువ్యాధులు ప్రభలకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. వ్యాక్సినేషన్ విషయం లో ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రభుత్వ వైద్యశాలల్లో రోగులకు నాణ్యమైన సేవలు అందించాలన్నారు. ప్రభుత్వ వైద్యశాలకు ఎక్కువ మంది రోగులు వచ్చేలా చూడాలన్నారు. గన్నవరం బీసీ కాలనీ, కేసరపల్లి చెంచుల కాలనిలో చేసిన మాదిరిగా జనవరి ఒకటవ తేదీ నుండి రోగుల ఇళ్లకు వెళ్లి రక్తనమూనాలు సేకరించి వాటిని ప్రభుత్వ వైద్యశాలల్లో పరీక్షలు చేయాలని సూచించారు. వైద్యశాలల్లో సమస్యలు పరిష్కరించి, మెరుగైన వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయిస్తానని యార్లగడ్డ హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా వైద్యశాలలకు రోజూ వస్తున్న రోగుల సంఖ్య, వారికి చేస్తున్న రక్తపరీక్షల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు గొడ్డళ్ళ చిన్నరామారావు, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు గుజ్జర్లపూడి బాబురావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News