-ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఎలివేటెడ్ కారిడార్లు, ఫ్లై ఓవర్లు అవసరం : ఎంపీ కేశినేని శివనాథ్
-నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, మోర్త్ ప్రాజెక్ట్ డైరెక్టర్ల తో సమీక్షా సమావేశం
-ఎన్టీఆర్ జిల్లాలోని జాతీయ రహాదారుల అభివృద్ది కి సంబంధించి పలు అంశాలపై ప్రస్తావన
-సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎంపీ బాలశౌరి, మంత్రి కొల్లు రవీంద్ర, ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రజాప్రతినిధులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లాలోని నేషనల్ హైవే సమస్యలన్నీ తర్వలోనే పరిష్కారం అవుతాయని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. మచిలీపట్నంలోని ఎంపీ వల్లభనేని బాలశౌరి కార్యాలయంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, మోర్త్ ప్రాజెక్ట్ డైరెక్టర్ల తో శుక్రవారం ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రజాప్రతినిధులు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ మేరకు ఎంపీ కేశినేని శివనాథ్ ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ సమావేశంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, మోర్త్ ప్రాజెక్ట్ డైరెక్టర్ల తో ఎంపీ కేశినేని శివనాథ్, ఎంపీ బాలశౌరి, మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్, వెనిగండ్ల రాము, మండలి బుద్ధప్రసాద్, కాగిత కృష్ణ ప్రసాద్, వర్ల కుమార్ రాజా, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ ఉమ్మడి జిల్లాలోని జాతీయ రహదారుల అభివృద్ది పై చర్చించారు.
ఎన్టీఆర్ జిల్లాలోని జాతీయ రహదారుల అభివృద్ధి, ట్రాఫిక్ సమస్యలు, భద్రతా అంశాలపై పలు కీలక ప్రతిపాదనలు చేయటంతో పాటు ఆ అంశాలపై చర్చించనట్లు తెలిపారు.
విజయవాడ కృష్ణలంక ప్రాంత వాసులు రోడ్డు దాటే సమయంలో తరచూ ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో, విజయవాడ కొత్త బస్టాండ్ వద్ద ఉన్న రాజీవ్ గాంధీ పార్క్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు జాతీయ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాల్సిన అవసరం ఉందని మరియు కనకదుర్గమ్మ వారధి వద్ద హైదరాబాద్ , చెన్నై , కొల్ కత్తా నుంచి వచ్చే వాళ్లకి ఎలివేటెడ్ కారిడార్ నుంచి ఎగ్జిట్, ఎంట్రీ ఇవ్వాల్సిందిగా ఎంపీ కేశినేని శివనాథ్ ప్రతిపాదించారు. అలాగే బెంజ్ సర్కిల్ నుంచి గోసాల వరకు సుమారు 10 కిలోమీటర్ల పొడవున ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారు.
అదేవిధంగా ఎన్.హెచ్–65 నుంచి ఎన్.హెచ్–16 ను కలుపుతూ కంకిపాడు నుంచి కేసరిపల్లి, నిడమానూరు నుంచి పోరంకి, తాడిగడప నుంచి ఎనికెపాడు వరకు మూడు స్పర్ రోడ్ల నిర్మాణ ప్రతిపాదనలపై కూడా సమీక్ష సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. ఎన్టీఆర్ జిల్లా ప్రజల రవాణా అవసరాలు, రోడ్డు భద్రత, నగర ట్రాఫిక్ సమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా ఈ ప్రతిపాదనలు చేశామని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు
ఇక ఎన్.హెచ్.ఏ.ఐ అనుమతి ఇచ్చి డీపీఆర్ పూర్తయి సిద్ధంగా వున్న మహానాడు సర్కిల్ నుంచి నిడమానూరు వరకు 5.5 కిలోమీటర్ల పొడవున ఫ్లై ఓవర్ నిర్మాణానికి సంబంధించిన పనులను తక్షణమే ప్రారంభించాల్సిందిగా కోరారు. .
అలాగే పెద్ద అవుట్ పల్లి నుంచి వెస్ట్ బైపాస్ రెండు వైపులా గొల్లపూడి వరకు సర్వీస్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి (ఎన్.హెచ్–65) పై గొల్లపూడి గ్రామం వద్ద ఉన్న జంక్షన్లో క్లోవర్ లీఫ్ ఇంటర్చేంజ్ నిర్మాణానికి ప్రతిపాదన చేస్తూ, దాని అవసరాన్ని అధికారులకు వివరించారు.
గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అమరావతి, గుంటూరు, హైదరాబాద్ వెళ్లే ప్రయాణీకుల సౌకర్యార్థం నగర ట్రాఫిక్లోకి ప్రవేశించకుండా ప్రయాణం సులభంగా సాగేందుకు, గన్నవరం నియోజకవర్గం కేసరిపల్లి గ్రామం నుంచి ముస్తాబాదు మీదుగా జక్కులనెక్కలం, వెస్ట్ బైపాస్లోని వెదురుపావులూరు టోల్ ప్లాజా వద్ద కలుపుతూ మరియు ఇదే మార్గాన్ని రామవర్పపాడు జంక్షన్ వరకు కూడా కలిపే విధంగా కొత్త ప్రతిపాదిత రహదారి నిర్మాణంపై సమావేశంలో చర్చించారు. దీని ద్వారా విజయవాడ నగర ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు, చిన్న అవుట్ వైపు ఆరు కిలోమీటర్లు వెనక్కి వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రయాణం సులభమవుతుందని ఎంపీ వివరించారు.
Prajavartha Online Telugu News