-ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఫిర్యాదుల స్వీకరణ
-మధ్యాహ్నం 2 గంటల నుంచి కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశం
– ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై మేఘా స్వరూప్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ గౌరవ చైర్మన్ కే.ఎస్. జవహర్ జనవరి 28న తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యటించనున్నట్లు ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన ప్రజల నుంచి అర్జీల స్వీకరణతో పాటు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. చట్టంలోని సెక్షన్–12 ప్రకారం గత ఐదు సంవత్సరాలుగా షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి అమలవుతున్న చట్టపరమైన నిబంధనలు, సంక్షేమ పథకాల అమలు స్థితిగతులపై కమిషన్ సమీక్ష చేయనుంది. ముఖ్యంగా ఎస్సీ/ఎస్టీ (అట్రాసిటీస్ నివారణ) చట్టం–1989, పౌర హక్కుల పరిరక్షణ చట్టం–1955 అమలు, ఎస్సీలకు సంబంధించిన భూ సమస్యలు, రిజర్వేషన్ అమలు, పీజీఆర్ఎస్లో అందిన ఫిర్యాదుల పరిష్కారం, కమిషన్కు ఏటీఆర్ల సమర్పణ, జిల్లా–డివిజనల్ స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశాల నిర్వహణ తదితర అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జనవరి 28న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు రాజమహేంద్రవరం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్లో షెడ్యూల్డ్ కులాలకు చెందిన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించనున్నారు. అనంతరం అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కలెక్టర్ కార్యాలయం, బొమ్మూరు లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్ఓఆర్, పీజీఆర్ఎస్, బ్యాక్లాగ్ ఖాళీలు, వివిధ శాఖల్లో అమలవుతున్న ఎస్సీ సంక్షేమ పథకాల పురోగతి వంటి అంశాలపై చర్చ జరగనుందని మేఘా స్వరూప్ తెలిపారు. ఈ సమావేశానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టి, సంబంధిత రికార్డులు, గణాంకాలతో జిల్లా, మండల స్థాయి అధికారులు హాజరుకావాలని ఇంచార్జి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ ఆదేశించారు.
Prajavartha Online Telugu News