గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఇన్ ప్రిన్సిపుల్ లే అవుట్ ప్యాట్రన్(ఐపిఎల్పీ) ప్రక్రియ పూర్తయిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను 10 రోజుల్లో క్లియర్ చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ పట్టణ ప్రణాళిక కార్యదర్శులు, అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరంలోని గోరంట్ల, రెడ్డిపాలెం, ఇన్నర్ రింగ్ రోడ్, సుద్దపల్లి డొంక తదితర ప్రాంతాల్లో పట్టణ ప్రణాళిక అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ఐపిఎల్పీలను తనిఖీ చేసి, పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్, ఎఫ్ఎల్ఎస్ దరఖాస్తులను స్వయంగా పరిశీలించి, వాటి పురోగతిపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలన్నారు. నిర్దేశిత ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లేఅవుట్లలో ఓపెన్ స్పేస్, ఎమినిటీస్, డ్రైన్లు మరియు రోడ్ల వెడల్పును క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. ప్రతి దరఖాస్తును అత్యంత జాగ్రత్తగా పరిశీలించి, ఏవైనా లోపాలు లేదా అభ్యంతరాలు ఉంటే వాటిని స్పష్టమైన వివరాలతో రిమార్క్స్ నోట్ చేసి తదుపరి అనుమతుల కోసం పంపాలని అధికారులకు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఒకే సర్వే నంబర్ పరిధిలో ఉన్న అన్ని ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు ఒకే ఐపిఎల్పీ చేయాలని, ఎల్ఆర్ఎస్ గడువు ముగిసిన అనంతరం అనధికార లే అవుట్ లపై చట్టప్రకారం తీసుకునే చర్యలపై ప్రజలకు అవగాహన కల్గించాలన్నారు. అదేవిధంగా, దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని, ఎక్కడా జాప్యానికి తావు ఉండకూడదని హెచ్చరించారు. దరఖాస్తులను క్రమబద్ధీకరించే క్రమంలో ‘ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్’ (ముందు వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత) విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, నిబంధనల మేరకు లేఅవుట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని చేయాలన్నారు.
పర్యటనలో సిటి ప్లానర్ డి.రాంబాబు, ఏసిపీలు రెహ్మాన్, జకిరా, పట్టణ ప్రణాళిక అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News