-కేంద్రం తీరుపై ఐజేయూ తీవ్ర ఆగ్రహం!
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జర్నలిస్టులు, స్వతంత్ర డిజిటల్ మీడియా సంస్థలు, సోషల్ మీడియా వేదికల పట్ల ప్రభుత్వం అనుసరిస్తోన్న తీరుపై ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వ విధానాలను విమర్శించే జర్నలిస్టులు, వ్యంగ్య రచయితలు, స్టాండప్ కమేడియన్లు, ఫ్యాక్ట్ చెకర్ల కంటెంట్ను, వీడియోలను ఏకపక్షంగా తొలగించడం, బ్లాక్ చేయడాన్ని “అప్రకటిత సెన్సార్షిప”గా ఐజేయూ అభివర్ణించింది.
ఈ మేరకు ఐజేయూ అధ్యక్షుడు బల్విందర్ సింగ్ జమ్ము, సెక్రటరీ జనరల్ డి.సోమసుందర్ శుక్రవారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
మొహమ్మద్ జుబేర్, మోలిటిక్స్, నేషనల్ దస్తక్, 4 పీఎం న్యూస్ వంటి సంస్థలతో పాటు స్టాండప్ కమెడియన్ రాజీవ్ నిగమ్ వంటి వారి సోషల్ మీడియా ఖాతాలను, కంటెంట్ను బ్లాక్ చేయడం కార్యనిర్వాహక అధికారాలను దుర్వినియోగం చేయడమేనని వారు మండిపడ్డారు.
స్వతంత్ర జర్నలిజం గొంతు నొక్కడానికి ప్రభుత్వం చేస్తోన్న ఇటువంటి ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వారు హెచ్చరించారు. ఆర్టికల్ 19(1)(ఏ) ప్రకారం రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛపై ఇది నేరుగా జరుగుతున్న దాడి అని ఐజేయూ నేతలు పేర్కొన్నారు.
రహస్య విధానాలతో, అస్పష్టంగా ఉన్నచట్ట నిబంధనలను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం భిన్నాభిప్రాయాలను అణచివేయలేదని వారు స్పష్టం చేశారు. “పరోక్ష సెన్సార్షిప్ విధించడం ద్వారా విమర్శనాత్మక జర్నలిజాన్ని అణచి వేయాలని చూస్తే దేశం మౌనంగా ఉండదు’ అని ఐజేయూ నేతలు ఘాటుగా స్పందించారు.
జర్నలిస్టులు, మీడియా సంస్థలపై జారీ చేసిన అన్ని ఏకపక్ష ‘టేక్డౌన’ ఆర్డర్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని, ఇటువంటి చర్యలకు గల కారణాలను బహిరంగంగా వెల్లడించాలని, జర్నలిస్టులను, స్వతంత్ర మీడియా ప్లాట్ఫారమ్లను భయభ్రాంతులకు గురిచేయడం ఆపాలని డిమాండ్ చేశారు. సెన్సార్షిప్ను ఎదుర్కొంటున్న జర్నలిస్టులు, మీడియా సంస్థలకు ఐజేయూ అండగా ఉంటుందని, మీడియా స్వేచ్ఛను హరించే ప్రతి ప్రయత్నాన్ని సమర్థవంతంగా ప్రతిఘటిస్తామని ఐజేయూ నేతలు బల్విందర్ సింగ్ జమ్మూ, డి.సోమసుందర్ ఆ ప్రకటనలో హెచ్చరించారు.
Prajavartha Online Telugu News