గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులు, కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ హెచ్చరించారు. సోమవారం శ్రీనగర్, పిఎస్ నగర్, వసంతరాయపురం తదితర ప్రాంతాల్లో పర్యటించి, క్షేత్రస్థాయిలో పారిశుధ్య పనుల తీరును పరిశీలించి, పలుచోట్ల పేరుకుపోయిన చెత్తను, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైన్లను చూసి అసహనం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర సుందరీకరణ మరియు ప్రజారోగ్యం విషయంలో ఎటువంటి రాజీ పడబోమన్నారు. ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, ప్రజారోగ్య అధికారులు మరియు సచివాలయ కార్యదర్శుల పనితీరులో ఆశించిన మార్పు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతంగా పనిచేయని వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతిరోజూ నూరు శాతం ఇంటింటికీ చెత్త సేకరణ జరగాలని, అలా జరిగినప్పుడే రోడ్ల మీద చెత్త వేసే పరిస్థితి ఉండదన్నారు. ఒకవేళ చెత్త సేకరణ సక్రమంగా జరుగుతున్నప్పటికీ, రోడ్ల మీద లేదా ఖాళీ ప్రదేశాల్లో చెత్త వేసే వారిపై భారీ అపరాధ రుసుం విధించాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. అలాగే, రోడ్ల పక్కన పేరుకుపోయిన భవన నిర్మాణ వ్యర్థాలను తక్షణమే తొలగించాలని, దీనిపై పర్యవేక్షణ పెంచాలన్నారు. నగర రోడ్లపై ఆవుల సంచారం వల్ల ట్రాఫిక్కు ఇబ్బందులు కలగడమే కాకుండా ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్లపై కనిపించే ఆవులను వెంటనే జిఎంసి గోశాలకు తరలించాలని ఆదేశించారు. గ్యాంగ్ వర్క్ నిర్వహణ సరిగా లేకపోవడంపై అధికారులను నిలదీస్తూ, ఇకపై గ్యాంగ్ వర్క్ పిన్ పాయింట్ గా పక్కాగా జరగాలని, లేనిపక్షంలో సంబంధిత ఇన్స్పెక్టర్లు, కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం 146వ సచివాలయంలోని ఆర్ఆర్ఆర్ (Reduce, Reuse, Recycle) సెంటర్ను పరిశీలించి, సెంటర్లను ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు సమర్థవంతంగా నిర్వహించాలని, ప్రజల నుంచి వచ్చే వ్యర్థాలను శాస్త్రీయంగా పునర్వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన పారిశుధ్యం అందించడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఫలితాలు క్షేత్రస్థాయిలో కనిపించాలని స్పష్టం చేశారు.
పర్యటనలో ఎస్ఎస్ లు సాంబయ్య, ఐజాక్, ప్రజారోగ్యాధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News