– జగత్ ప్రకాష్ నడ్డా, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మరియు రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ ఫార్మాస్యూటికల్ రంగంలో, బయోలాజిక్స్, బయోసిమిలార్స్, స్పెషాలిటీ డ్రగ్స్ ఇప్పుడు ఫార్మాస్యూటికల్ ఆదాయాలలో 40 శాతానికి పైగా వాటాను కలిగి ఉన్నాయి. జెనరిక్ మందులలో అగ్రస్థానం కారణంగా చాలా కాలంగా ‘ప్రపంచ ఫార్మసీ’గా పిలుస్తోన్న భారతదేశ ఫార్మాస్యూటికల్ పరిశ్రమ, ఇప్పుడు విస్తరణ నుండి ఆవిష్కరణల వైపు తన దృష్టిని మళ్లించడానికి సిద్ధంగా ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో, భారత ప్రభుత్వం జెనరిక్స్లో తన బలాన్ని నిలుపుకుంటూనే, ఈ అభివృద్ధి చెందుతున్న విభాగాలలో దేశం అధిక వాటాను దక్కించుకునేలా ముందుచూపుతో కూడిన విధాన రూపకల్పనని అమలు చేస్తోంది. దీని ద్వారా కొత్తగా ఎదుగుతున్న రంగాల్లో దేశానికి మరింత భాగస్వామ్యం దక్కేలా చూడటమే లక్ష్యంగా పెట్టుకుంది, అదే సమయంలో జనరిక్ రంగంలో ఉన్న బలాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతోంది.
2026-27 కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన రూ.10,000 కోట్ల ‘మిషన్ బయోఫార్మా మాన్యుఫ్యాక్చరింగ్ శక్తి’ ఈ దిశగా ఒక నిర్ణయాత్మక ముందడుగుగా నిలిచింది. రానున్న 8 నుంచి 10 సంవత్సరాలలో బయోఫార్మా ఆవిష్కరణలకు, అధిక విలువ కలిగిన చికిత్సా విధానాలకు ప్రపంచ కేంద్రంగా ఎదగాలన్న భారతదేశ సంకల్పానికి ఇది సంకేతం. లోతైన శాస్త్రీయ సామర్థ్యాలను పెంపొందించడం, ఆవిష్కరణల ఆధారిత సంస్థలను ప్రోత్సహించడం, అలాగే తదుపరి తరం ఔషధాలలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలపడం వంటి ఈ లక్ష్యాలనే ఆధారంగా చేసుకుని ఈ దిశగా ప్రయాణం కొనసాగుతోంది.
ఈ కార్యక్రమం బయోలాజిక్స్, బయోసిమిలర్స్, అధునాతన చికిత్సల రంగాల్లో దేశీయ సామర్థ్యాలను వేగంగా పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఫార్మాస్యూటికల్స్ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ, బయోటెక్నాలజీ శాఖ చేపట్టిన PRIP (ఫార్మా మెడ్టెక్ రంగంలో పరిశోధన, ఆవిష్కరణ ప్రోత్సాహం), రీసెర్చ్ డెవలప్మెంట్ & ఇన్నోవేషన్ పథకం, బయోనెస్ట్ వంటి కార్యక్రమాలకు ఇది తోడ్పడుతోంది. జీవ విజ్ఞాన రంగంలో, ముఖ్యంగా బయోఫార్మాస్యూటికల్స్లో పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించడమే వీటి ఉద్దేశ్యం. ఇవన్నీ కలసి దేశంలో ఆవిష్కరణ వాతావరణాన్ని బలపరచడం, పరిశ్రమ–విద్యాసంస్థల భాగస్వామ్యాన్ని పెంపొందించడం, జనరిక్ ఔషధాల నుంచి ఆవిష్కరణ ఆధారిత ఔషధ అన్వేషణ, అభివృద్ధి వైపు మార్పు తీసుకురావడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి.
ఈ వ్యూహంలో కీలకమైన అంశంగా ఫెర్మెంటేషన్ ఆధారిత తయారీ సామర్థ్యాల అభివృద్ధి నిలుస్తోంది. యాంటీబయాటిక్స్, వ్యాక్సిన్లు, ఎంజైమ్స్, బయోలాజిక్స్ తయారీలో దీనికి ఎంతో ప్రాధాన్యం ఉన్నప్పటికీ, ఈ రంగం చాలా కాలంగా దిగుమతులపై ఆధారపడుతూ వచ్చింది. మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టడం, సాంకేతికత అభివృద్ధి, బదిలీకి సహకారం అందించడం, లక్ష్యిత ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా ఈ కీలక రంగంలో దేశీయ సామర్థ్యాలను పెంచి, ప్రపంచ స్థాయిలో పోటీతత్వాన్ని బలపరచేందుకు భారత్ కృషి చేస్తోంది.
అదే స్థాయిలో ప్రాధాన్యం ఉన్న మరో అంశం దేశంలోని క్లినికల్ రీసెర్చ్ వ్యవస్థ విస్తరణ. ఏర్పాటు కానున్న 1,000 గుర్తింపు పొందిన క్లినికల్ ట్రయల్ కేంద్రాలు ప్రపంచ స్థాయి ఔషధ అభివృద్ధి కేంద్రంగా భారత స్థానాన్ని గణనీయంగా పెంచనున్నాయి. తక్కువ ఖర్చు ప్రయోజనం, పెరుగుతున్న నైపుణ్యం కలిగిన పరిశోధకుల వనరు వల్ల సమర్థవంతమైన, నాణ్యమైన క్లినికల్ పరీక్షలకు భారత్ ప్రత్యేక అవకాశాలు అందిస్తోంది. ఇదే సమయంలో నియంత్రణ వ్యవస్థలను బలోపేతం చేయడం, సంస్థాగత సామర్థ్యాలను పెంచడం ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపడే విధంగా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నారు. దీని వల్ల అనుమతులు వేగంగా లభించడం, ప్రపంచ స్థాయి భాగస్వాముల్లో విశ్వాసం పెరగడం సాధ్యమవుతోంది.
గత కొన్ని సంవత్సరాల్లో యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడియెంట్స్ (APIs), కీలక ప్రారంభ పదార్థాల (KSM) స్థానికీకరణలో భారత్ వేగంగా ముందడుగులు వేసింది. దీనికి PLI పథకం, బల్క్ డ్రగ్ పార్క్ పథకాలు ప్రధాన కారణం. ఈ చర్యల వల్ల దేశంలో ఔషధ ధరలు ప్రపంచంలోనే తక్కువ స్థాయిలో నిలిచాయి, ప్రజలకు వైద్యం ఖర్చు అందుబాటులో ఉండేలా సహకరించాయి. ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి పర్యోజన ద్వారా తక్కువ ధరల్లో నాణ్యమైన జనరిక్ ఔషధాలు మరింత విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి; 19,000కి పైగా జనౌషధి కేంద్రాలు లక్షలాది మందికి సేవలందిస్తున్నాయి. క్యాన్సర్, అరుదైన వ్యాధుల ఔషధాలపై కస్టమ్స్ సుంకాల సర్దుబాటు వంటి అనుబంధ చర్యలు ప్రాణరక్షక చికిత్సలను మరింత అందుబాటులోకి తెస్తున్నాయి. ఆధునిక చికిత్సలు విస్తరిస్తున్న ఈ సమయంలో అందరికీ సమానంగా చేరేలా చూడటం, ధరలు అందుబాటులో ఉండేలా కాపాడటం విధాన పరంగా ముఖ్య లక్ష్యంగానే కొనసాగుతోంది.
పరిశ్రమ రూపాంతరం చెందుతున్న ఈ దశలో స్థిరపడిన మార్కెట్లతో పాటు కొత్తగా ఎదుగుతున్న ప్రాంతాల్లోనూ భారత్ తన ప్రాభవాన్ని పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది, ముఖ్యంగా ఆవిష్కరణ ఆధారిత రంగాల్లో. ఈ మార్పుకు సంస్కరణలు ప్రధాన బలంగా నిలుస్తున్నాయి. నియంత్రణల సమన్వయం, అనుమతుల ప్రక్రియల డిజిటలైజేషన్, వేగవంతమైన క్లియరెన్సులు వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరుస్తున్నాయి. నాణ్యత ప్రమాణాలు, నియంత్రణ వ్యవస్థ బలోపేతం వల్ల భారత ఔషధాలపై ప్రపంచ స్థాయి విశ్వాసం కొనసాగుతోంది. అయితే పరిశోధన, అభివృద్ధి పెట్టుబడులను పెంచడం ఇంకా సవాలుగానే ఉంది. దీన్ని అధిగమించాలంటే ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం మరింత బలపడాలి.
ముందుకు చూస్తే విధాన మద్దతు, సాంకేతిక పురోగతి, మార్కెట్ అవకాశాల సమ్మిళితం ఔషధ రంగానికి అరుదైన వృద్ధి అవకాశాన్ని అందిస్తోంది. ఇప్పటికే రూ.4 లక్షల కోట్లకు పైగా విలువ ఉన్న దేశీయ మార్కెట్ స్థిరంగా విస్తరించనుంది. రాబోయే దశాబ్దంలో జనరిక్ ఔషధాల్లో అగ్రస్థానం కొనసాగించడమే కాకుండా, ఆవిష్కరణ ఔషధాలు, ఫెర్మెంటేషన్ ఆధారిత ఉత్పత్తులు, తదుపరి తరం చికిత్సల్లో శక్తివంతమైన కేంద్రంగా భారత్ ఎదగడానికి మంచి అవకాశాలు ఉన్నాయి.
ముగింపుగా, భారత ఔషధ రంగం ఇప్పుడు ఆవిష్కరణ, స్థైర్యం, ప్రపంచ స్థాయి పోటీతత్వం అనే లక్షణాలతో కొత్త దశలోకి ప్రవేశిస్తోంది. బయోఫార్మా శక్తి వంటి కార్యక్రమాలు, విస్తరిస్తున్న క్లినికల్ మౌలిక వసతులు, లక్ష్యిత తయారీ ప్రోత్సాహకాలు ఈ మార్పుకు బలంగా నిలుస్తున్నాయి. పరిమాణంపై ఆధారపడిన జనరిక్ కేంద్రం నుంచి అధిక విలువ గల బయోఫార్మా ఆవిష్కరణలో ముందంజలో ఉండే దేశంగా భారత్ క్రమంగా మారుతోంది. ఈ పరివర్తనం ప్రపంచ ఆరోగ్య రంగంలో భారత పాత్రను బలపరచడంలో కీలకంగా ఉండటంతో పాటు వికసిత భారత్ 2047 లక్ష్యాలకు పునాది వేస్తోంది.
Prajavartha Online Telugu News